చిరుకు కౌంటర్ బాలయ్యే
br /> సమైక్య నినాదాన్ని తీసుకున్న తర్వాత చిరంజీవికి సాధ్యమైనంత మేర కోస్తాంధ్రలో బలం పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కన్నా ఎక్కువగా ప్రాబల్యాన్ని, జనాదరణను పొందాల్సి ఉంటుంది. లేదంటే ప్రజారాజ్యం పార్టీ మనుగడు పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. దాంతో చిరంజీవి కోస్తాంధ్రపై తన దృష్టిని ప్రధానం కేంద్రీకరించి పని చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
చిరు పోలవరం సాధన యాత్ర ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రతివ్యూహానికి పూనుకున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ నటించిన సింహా చిత్రం విజయవంతం కావడం ఆ ప్రతివ్యూహానికి మరింత పదును పెట్టింది. సింహ విజయోత్సవ యాత్ర పేరుతో బాలకృష్ణ రాష్ట్ర యాత్రకు పూనుకున్నారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టతో తన యాత్రను ప్రారంభించినప్పటికీ ఆయన ప్రధానంగా కోస్తాంధ్రపైనే దృష్టి పెట్టారు. తన యాత్ర కేవలం సినిమా యాత్రగా మాత్రమే సాగడం లేదు. దానికి విశేష రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్య ఆధిపత్య పోరు సాగుతుందనే ఉద్దేశ్యాన్ని కూడా ఈ యాత్ర ముందుకు తెచ్చింది. ఇది చంద్రబాబుకు నష్టం కన్నా లాభమే ఎక్కువ చేస్తుందని భావిస్తున్నారు.
బాలకృష్ణ చంద్రబాబును దాటి ముందుకు సాగే పరిస్థితి లేదు. జనాదరణ ఉన్నప్పటికీ రాజకీయ చాతుర్యం బాలకృష్ణలో అంతగా లేదు. అందుకు తగిన నాయకుడు చంద్రబాబే. అంతేకాకుండా చంద్రబాబు వియ్యంకుడు కూడా. అందువల్ల ఇద్దరి మధ్య బద్ద శత్రుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఈ రకమైన వార్తాకథనాలతో పత్రికల నిండా బాలకృష్ణ విషయాలే ప్రచురితమవుతుండడం లాభం చేకూర్చి పెట్టే విషయమే. బాలకృష్ణ యాత్రతో చిరంజీవి బస్సు యాత్ర ప్రాధాన్యం చాలా వరకు తగ్గింది. చిరంజీవి ముందుగా తన యాత్రను ప్రారంభించినప్పటికీ బాలయ్య యాత్ర, చంద్రబాబు వ్యూహం చిరంజీవికి చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. మొత్తం మీద, చిరంజీవిని కౌంటర్ చేయడానికి చంద్రబాబు బాలకకృష్ణను మంచి ఆయుధంగానే వాడుతున్నారని చెప్పవచ్చు