వైయస్ జగన్ దెబ్బ ఎవరిపై?

మొత్తంగా, కదలిక లేని ప్రజారాజ్యం పార్టీకే వైయస్ జగన్ నుంచి ఎక్కువ ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉన్నదీ లేదు, పోయేదీ లేదు అనే నిర్లిప్తత స్థితికి చిరంజీవి చేరుకుంటే చెప్పలేం గానీ ఇప్పుడున్న స్థితిలోనైనా భవిష్యత్తులో పార్టీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ జగన్ శిబిరంలో ప్రస్తుతానికి చాలా మంది కాంగ్రెసు నాయకులే ముందు వరసలో కనిపిస్తున్నారు. ఆయన ఒకసారి పార్టీని ప్రకటించిన తర్వాత దాని రూపురేఖలు, విధివిధానాలు చూసిన తర్వాత, మున్సిపల్ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత ప్రజారాజ్యం పార్టీకి చెందిన జిల్లా నాయకులు క్యూ కట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకున్న చిరంజీవి సీమాంధ్రలో కూడా తన ప్రాబల్యాన్ని చాటలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఆయన పూర్తిగా దూరమైనట్లే. ఈ స్థితిలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా వైయస్ జగన్ ఈ ప్రాంతంలో కూడా పాగా వేయాలని అనుకుంటున్నారు. దీంతో చిరంజీవి ఎటూ కాకుండా పోయే ప్రమాదం నెలకొని ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలున్నాయి. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉన్నాయి. తెరాసను మిగతా ప్రాంతీయ పార్టీలతో జమ కట్టలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమమే ఆ పార్టీని నిలబెడుతుంది. వైయస్ జగన్ పార్టీతో తెలుగుదేశ, ప్రజారాజ్యం పోటీ పడాల్సి వస్తుంది. అయితే, రాష్ట్రంలో తమిళనాడు పరిస్థితి వస్తుందని, వైయస్ జగన్ పార్టీ తమ పార్టీ మాత్రమే ఉంటాయని, కాంగ్రెసు మట్టి కొట్టుకుపోతుందని తెలుగుదేశం నాయకులు ఆశ పడుతున్నారు. కానీ కాంగ్రెసు పార్టీ అంత బలహీనంగా లేదనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు గుర్తించాల్సి ఉంటుంది. ఏదో మేరకు తెలుగుదేశం పార్టీని కూడా వైయస్ జగన్ పార్టీ దెబ్బ తీస్తుందని చెప్పవచ్చు. అదే సమయంలో పూర్తిగా బలం కోల్పోయిన స్థితిలోనైనా చిరంజీవి కాంగ్రెసుతో జత కట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications