వైయస్ జగన్ ను నమ్ముతారా?
చిరంజీవి ప్రజాకర్షణ గల నాయకుడని, చిరంజీవి ప్రజలు చూసి వెళ్తారని, వైయస్ జగన్ కు ప్రజాకర్షణతో పాటు ప్రజాదరణ ఉందని రోజా అంటున్నారు. అందువల్ల వైయస్ జగన్ కు ప్రజలు ఓట్లు వేస్తారని వైయస్ జగన్ వర్గీయులు భావిస్తున్నారు. అలా అంచనా వేస్తున్నారు. పైగా, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కోసం కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు రాలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీలో అవమానం జరిగింది కాబట్టి బయటకు వచ్చారని రోజా, అంబటి రాంబాబు వంటి నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ప్రయత్నాలు చేయడం లేదని చెప్తే రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వారెంతగా చెప్పినా వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు.
కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. వైయస్సార్ ను కాంగ్రెసుకు దక్కకుండా చేసి తన సొంత చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో వైయస్సార్ ను మించిన నాయకుడు లేడని, కాంగ్రెసుకు అత్యంత విశ్వాస పాత్రుడైన నాయకుడని కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకత్వం కారణంగానే వైయస్సార్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. ఈ వాదన నమ్మేందుకు అనుగుణంగానే ఉంది. దానికి తోడు, వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్ కు దూరం చేయగలిగింది. ఈ పరిస్థితిలో వైయస్ జగన్ పార్టీ పెడితే నెట్టుకురావడం అంత సులభమైన విషయం కాదు.