హరికృష్ణను కార్నర్ చేసిన చంద్రబాబు

బెజవాడ రాజకీయ వేడిలో దూకుడుగా వ్యవహరించి చంద్రబాబుకు హరికృష్ణ సవాల్ విసిరారు. తనకు తోడుగా పార్టీ నాయకులు వల్లభనేని వంశీకృష్ణ, కొడాలి నాని ఉన్నారని అనుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వర రావుపై వారి చేత తిరుగుబాటు చేయించారు. కాస్తా రాజకీయం రంజుగా సాగుతుండగానే చంద్రబాబు తన చాణక్యనీతిని ప్రదర్శించి, సీన్ను తిరిగేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనక్కి తగ్గి, చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గారు. అయితే, ఆ తర్వాతనైనా హరికృష్ణ పరిస్థితి చక్కబడిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. దాదాపుగా హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లే కనిపిస్తోంది.
హరికృష్ణ ఆది, సోమవారాల్లో విజయవాడలో ఉన్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయనను తెలుగుదేశం నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దేవినేని ఉమా మహేశ్వర రావు సరేసరి, తనకు అత్యంత ఆప్తులని భావించిన వల్లభనేని వంశీ, కొడాలి నానీల అడ్రస్ కూడా లేకుండా పోయింది. గతంలో కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన హరికృష్ణను పట్టించుకోలేదనే నెపంతోనే వంశీ, కొడాలి నానీ ఉమామహేశ్వరరావుపై సమరానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు సమరానికి సమాయత్తం కావడం మాట అటుంచి, వారే హరికృష్ణ పక్కన నిలబడలేని స్థితి వచ్చేసింది. దీంతో హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేశారని అనుకుంటున్నారు. మళ్లీ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా హరికృష్ణ విజృంభిస్తాడా, చూడాల్సిందే.












Click it and Unblock the Notifications