తెలంగాణపై కిరణ్ది వైయస్ ఫార్ములానే
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తన ప్రభుత్వ 'ప్రోగ్రెస్ రిపోర్ట్'ను సోనియా గాంధీ ముందు ఉంచారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారనేందుకు 'రచ్చబండ' కార్యక్రమం విజయవంతం కావడమే నిదర్శనమని ఆయన చెప్పారు. అభివృద్ధిపై ఉద్యమ ప్రభావం పడలేదని తెలిపేందుకు ఇటీవల రాష్ట్రానికి రూ.25వేల కోట్ల పెట్టుబడులు రావడమే రుజువని ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అతి కొద్దిమంది, అదీ ఉద్దేశపూర్వకంగా మాత్రమే అంతరాయం కలిగించారని చెప్పారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు చేయూత అందిస్తున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన కనపడిందని, లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయని సోనియాకు వివరించారు. సమస్యలను పరిష్కరించి, ప్రజలకు న్యాయం చేస్తామని అధిష్ఠానానికి హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, వాటికి అందిస్తున్న ప్రోత్సాహకాలను గణాంకాలు, చిత్రాలతో సహా వివరించారు. తెలంగాణ ప్రాంతంలో మహీంద్రా అండ్ మహీంద్రకు చెందిన కొత్త ప్రాజెక్టు వస్తోందని, ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. చిత్తూరులోనూ ఒక భారీ ప్రాజెక్టు వస్తోందన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలపైనా సోనియాతో ముఖ్యమంత్రి చర్చించారు. కడప, పులివెందులలో పార్టీకి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై విశ్లేషించారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి వాదనలను సోనియా నమ్ముతారా అనేది చెప్పలేం. అప్పటికే ఆమె రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలు తెప్పించుకున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.