రాష్ట్రపతి పాలన తప్పదా?

Governor Narasimhan
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వేడి, వైయస్ జగన్ దాడితో కాంగ్రెసు అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితులను చక్కదిద్దడానికి తమ పార్టీ శాసనసభ్యులను కట్టిడి చేయాలనే ఏకైక మార్గం సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. ముఖ్యమంత్రి మారిన అస్థిరత ఛాయలు వీడడం లేదు.

ఈ స్థితిలో రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా అని అడిగితే దాని గురించి ఏం చెప్పలేనంటూ గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. నరసింహన్ సందిగ్ధమైన వ్యాఖ్య రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశాలున్నాయనే ప్రచారానికి తాజాగా తెర తీసింది.

ఢిల్లీకి రావద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఆదేశించింది. రాష్ట్రపతి పాలన విధించాలనే నిర్ణయానికి వచ్చినందు వల్లనే కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలా, శాసనసభను పూర్తిగానే రద్దు చేయాలా ఆనే మీమాంసలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంతగా బలగాలను మోహరించినప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాంతి నెలకొనడం లేదు. తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మీడియాను కట్టడి చేసినా ఫలితాలు ఇవ్వడం లేదు. మీడియాలో ప్రచారం కోసమే ఆందోళనలు చేస్తున్నారని చెబుతూ వచ్చిన మాటలు అబద్ధమని తేలిపోయింది. తెలంగాణలో పరిస్థితులు చేయి దాటిపోవచ్చునని కూడా అనుకుంటున్నారు. తెలంగాణలో హింస, విధ్వంసం చెలరేగే ప్రమాదం ఉందనే అంచనాకు కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ కారణంగానే కాకుండా తెలంగాణ వల్ల కూడా రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు కూడా ప్రభుత్వ అస్థిరతకు దారితీయవచ్చునని కేంద్రం అనుమానిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ కాకపోయినా కొంత మందైనా రాజీనామా బాట పట్టవచ్చునని భావిస్తున్నారు. కొద్ది మంది శాసనసభ్యులు రాజీనామా చేసినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అస్థిరం పాలవుతుంది. వైయస్ జగన్ వర్గం ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్ కలిసి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించవచ్చునని కూడా సమాచారం అందుతోంది. శ్రీకృష్ణ నివేదికపై 8 పార్టీలతో మరో దఫా సమావేశం జరిగేలోపే అనేక పరిణామాలు సంభవిస్తాయని భావిస్తున్నారు. దీంతో బడ్జెట్ సమావేశాల వరకు పరిణామాలు ఎలా ఉంటాయి? అని గవర్నర్ అంచనా వేసి నివేదిక పంపిన తర్వాతే కేంద్రం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. తెలంగాణలోని 11 మంది పార్లమెంటు సభ్యుల కన్నా సీమాంధ్రలోని 21 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరంగా మారడంతో తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీ నుంచి కేంద్రం నివేదిక తెప్పించుకుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+