కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఇప్పుడు కెసిఆర్ పెద్దగా ఉద్యమాల జోలికి వెళ్లే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మాత్రం దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధపడ్డారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు బస్సు యాత్ర చేపడితే, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు 48 గంటల నిరాహారదీక్షకు పూనుకున్నారు. రాజీనామాల విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రాజీనామాలు చేసిన తర్వాత వారు చాలా వరకు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని చెప్పవచ్చు. తెలంగాణ విషయంలో తమ మనుగడకు తీవ్రమైన ప్రమాదం వాటిల్లిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల నాయకులు తిరిగి తమ ఉనికిని ఖాయం చేసుకోవడానికి ఈ ఉద్యమాల ద్వారా ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.
కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తూ ఆందోళన బాట పట్టడం వల్ల కాంగ్రెసు అధిష్టానం దిగి వస్తుందని నమ్ముతున్నట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. ఇదే కోణంలో ఆయన మీడియాలో కూడా వార్తాకథనాలు వస్తున్నాయి. అందువల్ల పెద్ద యెత్తున ఆందోళనలకు సిద్ధపడాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గబోరని, వారు వెనక్కి తగ్గితే చూసుకోవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.