చంద్రబాబు ఆ పని చేస్తారా?
తాజాగా, రాష్ట్ర సాధన తెలంగాణ సమన్వయ కమిటీ చైర్మన్, స్వాతంత్ర్య సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చంద్రబాబుకు అదే సలహా ఇచ్చారు. అయితే, చంద్రబాబు అందుకు ప్రయత్నిస్తారా అనేది అనుమానంగానే ఉంది. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రమేనని, తమకు అందులో ఏ విధమైన పాత్ర ఉండాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని కూడా ఆయన అంటున్నారు. తన వైఖరిని ప్రకటించాల్సి వచ్చే సరికి మాత్రం ఎటూ కాకుండా గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేయడానికి తెలంగాణ, సీమాంధ్ర నాయకులకు తాను స్వేచ్ఛ ఇచ్చానని అంటున్నారు. దాంతో ఆయనది రెండు కళ్ల సిద్ధాంతంగా ప్రచారంలోకి వచ్చింది.
తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్ తెలంగాణవాదులు ఉన్నారో, లేదో చెప్పడం కష్టమే. చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రం కావాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు కోరుకుంటున్నారా, లేదా అనేది ప్రజలకు స్పష్టం కావడం లేదు. తెలంగాణ సాధన కోసం తాము పోరాటాలు చేస్తున్నామని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తున్నామని అంటున్నప్పటికీ పార్టీని కాపాడుకోవడానికే తప్ప తెలంగాణ సాధన కోసం వారు ప్రయత్నించడం లేదని సాధారణంగా అందరూ నమ్ముతున్న విషయం. అయితే, తెలుగుదేశం పార్టీలో హార్డ్కోర్ సమైక్యవాదులు మాత్రం ఉన్నారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు వంటి మరికొంత మంది అలాంటివారు. ఏమైనా, ఈ స్థితిలో చంద్రబాబు పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు సాగిస్తారనేది వట్టి మాటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.