జగన్కు తెలంగాణలో దమ్ము లేదా!

జగన్ ఇప్పటి వరకు తన ఓదార్పు యాత్రలను, దీక్షలను మొత్తం సీమాంధ్రలోనే చేపట్టారు. ఆయన కార్యక్రమాలన్నీ సీమాంధ్రకే పరిమితం అయ్యాయి. ఇటీవల జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం మినహా తెలంగాణలో ఆయన చేపట్టినదంటూ ఏమీ లేదు. గతంలో ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర, హైదరాబాదులో ఫీజు పోరు దీక్ష మినహా జగన్ తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలు ఏమీ లేవు. ఇవి కూడా తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉండని హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే చేపట్టారు. ఖమ్మం ఓదార్పు తర్వాత మహబూబాబాద్లో ఓదార్పు కోసం వస్తే తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేసి వెళ్లగొట్టారు. ఆ దెబ్బకు ఇప్పటి వరకు జగన్ తెలంగాణ ముఖం చూడలేదు. తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టడం లేదని ఏదో కార్యక్రమం చేపట్టి తెలంగాణలోని జగన్ వర్గంలో ఉత్సాహం నింపాలని పలువురు నేతలు కోరిన నేపథ్యంలో జగన్ ఇటీవల మహబూబ్నగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందులో జగన్ పాల్గొంటారని కూడా చెప్పారు.
అయితే అనూహ్యంగా ఆ కార్యక్రమం కూడా క్యాన్సిల్ అయింది. మహబూబ్నగర్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవలసిన జగన్ తిరుపతి ముట్టడిలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్లీనరీలో తెలంగాణపై స్పష్టత ఇస్తామని వైయస్ఆర్ పార్టీ చెబుతున్నప్పటికీ తెలంగాణవాదానికి జంకిన జగన్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అంశం చాలా సున్నతమైనదని అందుకే దానిపై వ్యూహాత్మకంగా వెళుతున్నామని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు. త్వరలో జగన్ తెలంగాణలో పర్యటిస్తారని చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications