కాంగ్రెసు రాజకీయాలతో చిరు ఉక్కిరిబిక్కిరి

కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో మకాం వేసి, రామచంద్రయ్య మంత్రి అవకాశాలను దెబ్బ తీయడానికి చెమటోడుస్తున్నారు. మరోవైపు, చిరంజీవిని రాష్ట్రంలో మంత్రి పదవికి పరిమితం చేసే ప్రయత్నాలకు కూడా పూనుకున్నారు. కేంద్రంలో చిరంజీవికి మంత్రి పదవి, రామచంద్రయ్యకు రాష్ట్రంలో మంత్రి పదవి దక్కాల్సి ఉంది. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వకుండా, చిరంజీవికి ఇస్తే రాష్ట్రంలో పార్టీకి మేలు జరుగుతుందని కడప జిల్లా నాయకులు వాదిస్తున్నారు. చిరంజీవిని కేంద్రంలో మంత్రివర్గంలోకి తీసుకుంటే దానివల్ల ఖాళీ అయ్యే తిరుపతి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమని వారు పార్టీ అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.
దానికితోడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు ఒక రకంగా చిరంజీవికి దిమ్మ తిరిగే పరిస్థితే ఉంది. ఇంత కాలం బలహీనంగా కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా జూలు విదిలించినట్లే కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆధిపత్య రాజకీయాలకు ఆయన విరుగుడు కనిపెట్టినట్లే ఉన్నారు. కడప జిల్లా నాయకులు ఓ వైపు చిరంజీవి ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఒక్కసారిగా దర్శకనిర్మాత, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖ చిరంజీవికి అశనిపాతంలా మారింది. తాను ఎవరికీ లేఖ రాయలేదని దాసరి నారాయణ రావు చెబుతున్నప్పటికీ ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు.
చిరంజీవి కేంద్రంలోకి వెళ్తే, తన రాజ్యసభ సీటుకు ఎసరు వస్తుందని దాసరి నారాయణ రావు భావిస్తున్నారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి దాసరి నారాయణరావును దగ్గరు చేసుకుని చిరంజీవిని దెబ్బ తీసే ప్రయత్నాలు సాగిస్తున్నారని, అందులో భాగంగానే దాసరి నారాయణ రావు లేఖ ఉదంతం చోటు చేసుకుందని అంటున్నారు. చిరంజీవిని రాష్ట్రంలో మంత్రి పదవికి పరిమితం చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఆయన నుంచి పోటీని నివారించుకోవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద, చిరంజీవికి కాంగ్రెసు రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications