జగన్ వర్గంపై వేటుతప్పదా? పనిలో పనిగా..

2009లో కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు జగన్కు జై కొడుతున్న విషయం తెలిసిందే. పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ తదితరులు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
ఇదే దారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి, పేర్ని నానిలు ఉన్నారు. వారు శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేయనున్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా కాంగ్రెస్కు గుడ్బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధిష్ఠానాన్ని ధిక్కరించిన వారంతా బహిష్కృతులేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం కొనసాగించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పార్టీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న నేతలు బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించే అవకాశం లేదు. ఈ సమయంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇబ్బందికరంగా ఉంటుందని అధికార పార్టీ భావిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన పది మంది ఎమ్మెల్సీలు మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎన్నికలు జరుగనున్నాయి.
బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగాలన్నా, ఎమ్మెల్సీల ఎన్నికల్లో తాము పై చేయి సాధించాలన్న జగన్కు జై కొడుతున్న ఎమ్మెల్యేలపై వేటు వేస్తేనే బాగుంటుందని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు విప్ వర్తించక పోవడం గమనార్హం. అయితే కేవలం జగన్ వర్గం ఎమ్మెల్యేల పైనే కాకుండా.. టిడిపి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేల పైనా వేటుపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications