జగన్, ఉద్యమం: అక్టోబర్లో 'టి', ఇద్దరు పిసిసిలు?

ఆగస్టు 5న పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజునే సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించి, తెలంగాణపై తీర్మానం చేస్తారని టి కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్లో రెండు ప్రాంతాలకు ఇద్దరు పిసిసి చీఫ్లను నియమిస్తారని చెబుతున్నారు. అక్టోబర్లో రాష్ట్ర విభజన ఖాయమని కూడా తేల్చేస్తున్నారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నందున, ఇక ఈ అంశంపై మళ్లీ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని ఓ నిర్ణయానికి వచ్చారట.
అధిష్ఠానం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసినందున కొత్తగా ఎలాంటి నివేదికలను ఇవ్వనవసరం లేదనే అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్ మంత్రి జానా రెడ్డితో ఎంపీలు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, విహెచ్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. జరగనున్న పరిణామాలపై గంటకు పైగా చర్చించారు. ఇక తెలంగాణ ఎంతో దూరంలో లేదని సిడబ్ల్యూసి తీర్మానం చేయనుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో తీర్మానం అంత ముఖ్యం కాదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారని, ఇప్పటికే స్పీకర్ నాదెండ్ల మనోహర్తో అధిష్ఠానం చర్చలు జరిపిందని, రాయల తెలంగాణ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టి, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని తెలంగాణ నేతలు చెబుతున్నారు. రాయల తెలంగాణ ఇస్తే జగన్కు కొత్త రాష్ట్రంలోనూ అడుగు పెట్టే అవకాశం ఇచ్చినట్లవుతుందని, సీమను ముక్కలు చేస్తే ఉద్యమం కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
జగన్, ఉద్యమం నేపథ్యంలో రాయల తెలంగాణను పక్కన పెట్టారని అంటున్నారు. హైదరాబాద్ను రెండు, మూడేళ్ల పాటు కేంద్ర పరిపాలన ప్రాంతంగా ఉంచి, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారట. ఎవరు అడ్డుకున్నా ఫలితం ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు టిజి వెంకటేష్ వంటి సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు చూసినా విభజనకు అనుకూలంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications