అంతలా ఖర్చు చేస్తేనే జగన్ పార్టీ టిక్కెట్!?
సర్వేలో గెలుస్తావని తేలితేనే టిక్కెట్ ఇస్తానని పార్టీ తీర్థం పుచ్చుకునే వారికి జగన్ చెప్పారని అప్పట్లో కథనాలు వచ్చాయని, ఇప్పుడు మాత్రం కోట్లు ఖర్చు పెడితేనే టిక్కెట్ అంటున్నట్లుగా విమర్శలు వస్తున్నాయని రాసింది. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం ఖర్చు పెట్టే వారిని చూసే జరుగుతోందట. తొలి నుండి పార్టీలో ఉన్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ హామీ వెనుక గూడార్థం ఇదేననే విమర్శలు వస్తున్నాయట.
మరోవైపు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు డబ్బు ఖర్చు పెట్టటానికి అధిష్ఠానం ముఖ్యులు ససేమిరా అంటుండటంతో ఇప్పటికే ఒకస్థాయి గుర్తింపు పొందిన చాలామంది నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఖర్చు భారం మోయలేకపోవడం జన సమీకరణపై పడుతోందట. జగన్ పార్టీ పెట్టినప్పుడు వైయస్ సెంటిమెంట్ కారణంగా అతనికి వస్తున్న ఆదరణ చూసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారని, అయితే ఏ కార్యక్రమం చేపట్టినా తమ నెత్తినే భారం పడుతుండటం వల్ల ఢీలా పడిపోతున్నారట. మరోవైపు జగన్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని వాపోతున్నారట.
దీంతో పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడంతో చాలామంది నేతలు ఖర్చుకు వెనుకాడటమే కాక, ఆర్థిక స్ధోమత అంతంతమాత్రంగా ఉన్న కొందరు నాయకులైతే తమ వద్ద ఉన్నదంతా ఖర్చు చేసి ఒట్టి చేతులతో మిగిలిపోయారట. అధిష్ఠానం పెద్దలు పైసా విదల్చడం లేదని, దీంతో పలు పార్టీ కార్యక్రమాలు పేలవంగా తయారవుతున్నాయని పేర్కొంది. షర్మిల పాదయాత్రలో, విజయమ్మ దీక్షలో సమన్వయలోపం, సమీకరణ లోపం కనిపించిందంటున్నారు.
నియోజకవర్గాల వారీ సమన్వయ కర్తలే కాబోయే పార్టీ అభ్యర్థులని అధిష్ఠానం పెద్దలే చెబుతుండగా, వారి నియామకాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆ పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయని రాసింది. తమ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి రూ.3 కోట్లు ఖర్చు పెడ్తామన్న వారికే లోక్సభ టికెట్ ఖాయం చేస్తున్నారని, కనీసం ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్ధోమత కలిగిన వారికే అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయట. జగన్ పేరు చెబితే ఎన్నికల్లో గెలుస్తారని మొదట చెప్పి ఇప్పుడు ఖర్చుల పేరుతో టిక్కెట్ ఇవ్వడమేమిటని ఆశావహులు వాపోతున్నారట.