పిక్చర్స్: తెలంగాణపై వైయస్ లాగే కిరణ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణపై దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వైఖరినే అవలంబించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఆయన తాజా వ్యవహారశైలి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడకుండా, కేంద్రంపై భారం వేశామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాన్ని రూపొందించుకుని ఆయన అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణలోని సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లను ప్రోత్సహిస్తూ గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఓ జట్టును తయారు చేసుకున్నారు. వారి చేత అభివృద్ధి జపం చేయిస్తూ తెరాసను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. తెరాస ఆందోళన కార్యక్రమాలను చేపడితే, వాటిని అడ్డుకోవడానికి వీధుల్లోకి రావడానికి కాంగ్రెసు తెలంగాణ జూనియర్ నేతలు, కార్యకర్తలు కయ్యానికి కాలు దువ్వారు. దీనివల్ల పరిస్థితి విషమించే పరిస్థితి ఎదురు కావడంతో తెరాస తన కార్యక్రమాలను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అదే వ్యూహాన్ని సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని కొంత మంది జూనియర్ మంత్రులను, శాసనసభ్యులను ఆయన ప్రోత్సహిస్తూ, తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే తెరాసను తిప్పి కొట్టడానికి వారు సిద్ధపడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెరాస సభ్యులు హరీష్ రావుపై, ఈటెల రాజేందర్పై విరుచుకుపడిన తీరు గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చాయి.
తాను తెలంగాణ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను కూడా కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శానససభలో వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే మేలు గురించి కూడా వివరించారు. ఆ రకంగా తెలంగాణ అభివృద్ధికి తాను ఎంతో చేస్తున్నానని చెబుకుంటూ తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యుల చేత తెరాసపై ఎదురుదాడికి పురికొలుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే తెలంగాణలోని సీనియర్లను పక్కన పెట్టి తనకు విధేయంగా ఉండే జూనియర్ల జట్టును ఏర్పాటు చేసుకున్నారు. ఆ జట్టు ద్వారా ఎక్కడికక్కడ తెరాసను ఎదుర్కునే పనికి పదును పెట్టారు. అభివృద్ధి మంత్రంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో వైయస్ మాదిరిగా తనదైన జట్టును ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ జట్టు ద్వారా తెరాసను ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసి, అమలు చేస్తున్నట్లే కనిపిస్తోంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ జట్టులో కీలకమైన నాయకుడిగా అర్థమవుతోంది. తెరాస సభ్యులను తిప్పికొట్టడానికి శుక్రవారం శాసనసభలో ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. శనివారం ఆయన మాట్లాడిన తీరు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తోంది.
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దగ్గరకు తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సూచనలను తుచ తప్పకుండా ఆచరిస్తూ తెరాసను ఎదుర్కోవడానికి తగిన అస్త్రశస్త్రాలతో ఆయన సిద్ధపడినట్లు చెప్పుకోవచ్చు.
హైదరాబాదుకు చెందిన మంత్రి దానం నాగేందర్ శుక్రవారం శానససభలో మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి వ్యూహాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని ఆయన అన్నారు. పైగా, తెరాసను కుటుంబ సభ్యుల పార్టీగా అభివర్ణించారు. తెరాసపై ఆయన విరుచుకుపడ్డారు.
సంగారెడ్డి శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కెసిఆర్పై, తెరాస నేతలపై ఆయన ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇప్పుడు అవసరం లేదని ఆయన ఆ మధ్య చెప్పనే చెప్పారు.
తెలంగాణ విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో ఇచ్చిన హామీనే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఇచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి శైలి కూడా మారింది. ఆయన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ విషయం శుక్రవారం ఆయన శానససభలో మాట్లాడిన తీరు ద్వారా అర్థమవుతోంది. ఆయన తెలుగు భాష కూడా సానబట్టినట్లుగా ఉంది. తెలుగు సరిగా మాట్లాడడం రాదనే విమర్శను ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎదుర్కుంటూ వచ్చారు.
శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ చేసిన ప్రసంగం ఆయన తెలుగు వాగ్ధాటిపై ప్రత్యేక కసరత్తు చేసినట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి ప్రసంగంపై ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రికి మంచి సలహాదారులే లభించినట్లున్నారని ఆయన అన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి పట్టు సాధించడానికి అంతర్గతంగా చేస్తున్న కసరత్తుకు అద్దం పడుతుంది.