సర్వే: తెలంగాణ ఇస్తే కాంగ్రెసు అదుర్స్?
రాహుల్ గాంధీ తనకు కచ్చితమైన లెక్కలు కావాలని అడగడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలను జైపూర్ చింతన్ శిబిర్లో రాహుల్ గాంధీ ముందు పెట్టడానికి ఆ పార్లమెంటు సభ్యుడు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీతో పార్లమెంటు సభ్యుడు సర్వే చేయించినట్లు సమాచారం.
తెరాసను విలీనం చేసుకుంటే కాంగ్రెసు పార్టీ 17 లోకసభ స్థానాల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని, 119 శానససభా స్థానాల్లో 70 నుంచి 80 స్థానాలను గెలుచకుంటుందని ఆ సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో తనకు కచ్చితమైన సమాచారం కావాలని రాహుల్ గాంధీ అడిగినట్లు చెబుతు్నారు. సర్వే ఫలితాల నివేదికను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు జనవరి 14వ తేదీన రాహుల్ గాంధీకి సమర్పించినట్లు సమాచారం.
2014లోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడకపోతే కాంగ్రెసుతో పాటు తెరాస కూడా నష్టపోతుందని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఫలితాన్ని దక్కించుకోవాలంటే తెరాసను కలుపుకోవాల్సిందేనని సర్వే ఫలితాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోయినా తెలంగాణ వాదం బలంతో తాము మెజారిటీ శాసనసభా స్థానాలను, లోకసభ స్థానాలను గెలుచుకుంటామని తెరాస నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, రాష్ట్ర ఏర్పాటుకు తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని, పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెరాస నాయకులు చెబుతున్నారు. కాంగ్రెసు నాయకులు చర్చలకు ఆహ్వానించినప్పుడు విలీనం అంశం చర్చకు వస్తుందని వారంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలం పుంజుకున్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణ విషయంలో తటస్థ వైఖరి తీసుకున్న తెలంగాణ మంత్రులకు, శానససభ్యులకు ఓటమి తప్పదని సర్వేలో తేలింది. తెరాస, తెలుగుదేశం నుంచి జంప్ చేసిన నేతలతో వైయస్సార్ కాంగ్రెసు పుంజుకుంటందని సర్వే ఫలితాలు వెల్లడించినట్లు సమాచారం.