క్యాస్ట్: అప్పుడు ఎన్టీఆర్, వైఎస్, ఇప్పుడు బాబు, జగన్

హైదరాబాద్: భారత రాజకీయాల్లో కులాల పాత్ర అత్యంత ముఖ్యమైంది. కులవృత్తులు క్రమంగా ధ్వంసమైపోతున్నప్పటికీ వాటి మూలాలు మాత్రం గట్టిగా ఇప్పటికీ ఉన్నాయి. రాజకీయాలు కుల సమీకరణాల మీద ఆధారపడి నడుస్తున్నాయని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. భారత దేశంలో ఇందిరా గాంధీ బలంగా కుల సమీకరణాలను వాడుకున్నారు.

గరీబీ హఠావో నినాదం ద్వారా ఆమె ఎస్సీ, ఎస్టీల్లోకి దూసుకుపోయారు. దళితుల ఓటు బ్యాంక్ కాంగ్రెసుకు ఎనలేని బలంగా ఉంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెసుకున్న ఓటు బ్యాంక్ అదే అయినప్పటికీ రెడ్లు పాలకులు ఉంటూ వచ్చారు. రెడ్ల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. బీసీలు విస్మరణకు గురయ్యారు.

ఆ కారణంగా ఎపిలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దాన్ని ఆసరా చేసుకుని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రలోనూ బీసీలను చేరదీశారు. ఆధిపత్య కులం కమ్మ సామాజికవర్గమే అయినప్పటికీ బీసీలు టిడిపిని తమ పార్టీగా సొంతం చేసుకున్నారు. రెండో తరం విద్యావంతులైన దళితులకు సీట్లిచ్చారు.

Caste politics in Andhra Pradesh

ఎన్టీ రామారావు రాజకీయ సమీకరణాల వల్ల యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, కెఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు, దేవేందర్ గౌడ్, అల్లాడి రాజ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణా యాదవ్, దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాం వంటి బీసీ వర్గాలు నాయకులుగా ఎదిగి వచ్చారు.

కాగా, కాంగ్రెసుకు ఉన్న దళిత ఓటు బ్యాంకును చీల్చడానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తెచ్చి, మాలమాదిగలుగా విడగొట్టారని అంటారు. దాంతో కాంగ్రెసు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత ఓటు బ్యాంకును చాలా వరకు కోల్పోయింది. తెలంగాణ మాదిగలు ఎక్కువగా ఉంటారు. దాంతో తెలంగాణలో టిడిపి బలంగా తయారైందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు

ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత మరోసారి రాజకీయ సమీకరణాలు మారుతాయని భావించారు. కాపు సామాజిక వర్గం చిరంజీవి వెంటన నడవడానికి సిద్ధపడింది. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండడంతో ఎక్కుగా కాపు సామాజిక వర్గం కాంగ్రెసు వైపు ఉంటూ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెసు పార్టీకి పెద్ద గండి పడుతుందని భావించారు.

Caste politics in Andhra Pradesh

అయితే, ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాపు సామాజిక వర్గం మద్దతు లభించినప్పటికీ ఇతర వర్గాలను సమీకరించుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెసు పార్టీ తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి చంద్రబాబుకు చేజారి పోయింది. ఆ ఎన్నికల్లోనే జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ ఆంధ్రప్రాంతంలో పోటీ చేసింది. లోకసత్తా పార్టీ కమ్మ సామాజిక వర్గం ఓట్లను చీల్చడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు కూడా.

రాయలసీమలో రెడ్లూ తెలంగాణ రెడ్లూ ఒక్కటి కావడం, ఇతర వర్గాల మద్దతు స్వల్ప మెజారిటీతోనైనా కాంగ్రెసు పార్టీని ఆ సమయంలో తిరిగి అధికారంలోకి తెచ్చింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుతో విభాజిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు తెలుగుదేశం. బిజెపి కూటమి వైపు నిలిచారని, దానివల్లనే టిడిపి అధికారంలోకి వచ్చిందని అందరూ అంగీకరించే విషయమే.

కాపులు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వారికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆసరా చేసుకుని ఇప్పుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కాపులను టిడిపి నుంచి వేరు చేసి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారనేది టిడిపి చేసే ఆరోపణ. ఇందులో నిజం లేకపోలేదు కూడా. సొంతంగా అధికారంలోకి రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల కాపులు ఎటు వైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు బలం పెరుగుతుంది.

రెడ్ల ఆధిపత్యంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసుకు కాపుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో వైయస్ జగన్ ఉన్నారని భావిస్తున్నారు. చంద్రబాబు దాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కులాల పోరులో ఇప్పుడు ఎపి రాజకీయం నలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+