కెసిఆర్ దూకుడు: చంద్రబాబుకు చిక్కులే చిక్కులు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు కేసీఆర్ సీఎం కాగా, ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు.
హైదరాబాద్ రాజధానిగా సీఎం కేసీఆర్, ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ పరిపాలనలో దూసుకుపోతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం రాజధాని లేకుండా, విజయవాడ నుంచి పరిపాలనను సాగిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ ముహుర్తాన సీఎంగా బాధ్యతలు స్వీకరించారో గానీ, అప్పటి నుంచి ఆయనకు అన్నీ ఇబ్బందులే.
తాజాగా ఏపీలో కాపు ఉద్యమం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా జరుగుతుండటం గమనార్హం.
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని హుదూద్ తుఫాన్ కకావికలం చేసింది. హుదూద్ తుఫాన్ వల్ల ఏపీలో ప్రధాన పట్టణమైన విశాఖపట్నం ధ్వంసమైంది. చంద్రబాబు సైతం విశాఖను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు గాను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
విశాఖ తిరిగి సాధారణ యథాస్థితికి రావడంతో ఆయన కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి మళ్లీ విజయవాడ నుంచి పరిపాలనను కొనసాగించారు. అంతా సవ్యంగా కొనసాగుతుందుని అనుకున్న తరుణంలో ఏపీలో ప్రతిపక్షాలు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మరో ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఇరకాటంలో పడేశాయి.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ కార్యకర్త మునిరత్నం ఆత్మహత్య చేసుకోవడం చంద్రబాబుని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాలు ఏపీ ప్రభుత్వంతో పాటు, చంద్రబాబుకు పెద్ద మచ్చ తెచ్చాయి.
రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల్లో భాగంగా తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో 26 మంది భక్తులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై ఏపీ మొత్తం పెద్ద చర్చే జరిగింది. సీఎం చంద్రబాబే ఈ ఘటనకు బాధ్యుడంటూ దుమ్మెత్తి పోశాయి. చివరకు దీనిపై చంద్రబాబు ఓ విచారణ కమిటీని వేశారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితానికే మచ్చ తెచ్చాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో టీటీడీపీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం కూడా ఆయన్ని ఇబ్బందులు పాలు చేసింది.
ఇలా చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఆయన్ని ఒత్తిడిలో పడేస్తోంది. ఆ తర్వాత విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ స్కాం యావత్ ఆంధ్రప్రదేశ్ను ఒక కుదుపు కుదిపింది. కాల్మనీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ సత్యానందం స్వయాన చంద్రబాబుతో దిగిన ఫోటో రావడంతో ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోశాయి.
ఇలా వరుసగా ఏపీలోని చాలా సమస్యలు ఆయన్ని ఒత్తడికి గురి చేశాయి. తాజాగా ఏపీలో పెద్ద ఎత్తున మొదలైన కాపు ఉద్యమం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టే కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.
తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తుని విధ్వంస కాండలో రత్నాచల్ ఎక్స్ప్రెస్తో పాటు, పోలీస్ స్టేషన్ను ఆందోళనకారులు తగులబెట్టారు.
ఆ తర్వాత కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ జీవోను విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాపులను బీసీల్లో చేర్చని పక్షంలో తన భార్యతో కలిసి తన సొంత గ్రామమైన కిర్లంపూడిలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానన్నారు.
ఇలా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. చంద్రబాబు పాలన సజావుగా జరగకపోడానికి కారణం ఆయన స్వీకారం చేసిన ముహుర్త బలం సరిగా లేదనే వాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ సీఎంగా చంద్రబాబూ జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార చేసినప్పుడు ముహూర్త బలం లేనందునే చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయని గతంలో విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు.