మోడీ టార్గెట్ గా దావూద్ స్కెచ్ : డీ గ్యాంగ్ భారీ కుట్ర
సంకీర్ణ ప్రభుత్వాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. సంపూర్ణ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మతతత్వ పార్టీగా ఫక్తు హిందూ సాంప్రదాయ వాదిగా ముద్రపడ్డ మోడీ మరియు బీజేపీ ప్రభుత్వాన్ని అదే ఫార్ములాతో దెబ్బకొట్టే ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈ తతంగం మొత్తానికి పెద్ద ప్లానే వేసినట్టుగా తాజాగా ఆధారాలు బయటపడ్డాయి.
దేశంలో మత కలహాలు సృష్టించడం ద్వారా దేశ సమగ్రతను విచ్చిన్నం చేయాలని భావించిన దావూద్, ఇందుకోసం పక్కా ప్లాన్ ద్వారా 10 మంది తన అనుచరులను ఇండియాలో దింపినట్టుగా సమాచారం. కేంద్రమంత్రులు, ఆర్.ఎస్.ఎస్ నేతలతో పాటు పలు చర్చిలు, చర్చిలకు సంబంధించిన ఫాదర్లను టార్గెట్ చేసుకుని డీ గ్యాంగ్ ఇండియాలోకి ఎంటర్ అయినట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ వెల్లడించింది.
ప్లాన్ లో భాగంగానే రంగంలోకి దిగిన డీ గ్యాంగ్ షూటర్స్.. గతేడాది నవంబర్ 2న ఆర్.ఎస్.ఎస్ నేతలు శిరీష్ బెంగాలీ, ప్రగ్నీష్ మిస్త్రీలను గుజరాత్ లో హత్య చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. 1993లో ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు యాకుబ్ యెమెన్ ను ఉరి తీసినందుకు ప్రతీకార చర్యగానే ఈ హత్యలకు పాల్పడినట్టుగా చెప్పారు. ఇదే విషయాలతో కూడిన చార్జీషీట్ ను రేపు కోర్టులో దాఖలు చేయనుంది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ).