కొత్త పార్టీ యోచన లేదు,కెసిఆర్ మిత్రుడే, ప్రజలే ఆత్మీయులు
కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశ్యం తమకు లేదని జెఎసి చైర్మెన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం తాము పోరాటం చేస్తామన్నారు ఆయన.
హైదరాబాద్: రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాల్సిన అవసరం తనకు లేదని జెఎసి చైర్మెన్ ఫ్రోఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. తన గురించి తెలిసిన వారేవరూ కూడ తాను పార్టీని ఏర్పాటుచేస్తారంటే నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ పై, జెఎసి కార్యక్రమాలపై టిఆర్ఎస్ గుర్రుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జెఎసి తప్పుబడుతోంది. ఈ తరుణంలో అధికార పార్టీ నాయకులు జెఎసితో పాటు ప్రధానంగా కోదండరామ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శులు గుప్పిస్తున్నారు.
జెఎసి కూడ అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను తాము ఎత్తిచూపుతున్నామని జెఎసి నాయకులు చెబుతున్నారు. తమపై తప్పుడు ప్రచారంలో భాగంగానే రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారమని జెఎసి అభిప్రాయపడుతోంది.
కులాలు, మతాల పేరుతో తానెప్పుడూ కూడ గుర్తింపు పొందలేదని జెఎసి చైర్మెన్ చెబుతున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే జెఎసి పనిచేస్తోందని జెఎపి నాయకులు చెబుతున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు ఉద్దేశ్యం లేనేలేదు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొత్త పార్టీని ఏర్పాటుచేస్తారని జెఎసి పై ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని కోదండరామ్ కొట్టిపారేశారు. కొత్త పార్టీ ఏర్పాటు అనే ఆలోచనే తమకు లేదన్నారాయన. తన గురించి తెలిసిన వారెవరూ కూడ ఈ విషయాన్ని నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. అసలు పార్టీ పెట్టే ఉద్దేశ్యమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తమ పై వ్యూహత్మకంగా దాడి చేసే ఉద్దేశ్యంతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోదండరామ్ చెబుతున్నారు.
కెసిఆర్ కు, జెఎసి మద్య దూరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జెఎసి చైర్మెన్ కోదండరామ్ కు, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమద్య దూరం పెరుగుతూ వస్తోంది. రోజు రోజుకు ఈ అగాధం ఇంకా పెరుగుతూనే ఉంది.. కాని తగ్గడం లేదు. ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకొన్న తర్వాత కెసిఆర్ జెఎసి చైర్మెన్ కోదండరామ్ కు అపాయింట్ ఇవ్వలేదు. అయితే కోదండరామ్ సిఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదని జెఎసి వర్గాలు చెబుతుంటాయి. మరో వైపు ప్రజల సమస్యలపై నే ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ ను అడిగామని జెఎసి వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.ఈ దూరం పెరుగుతూనే ఉంది. జెఎసి పై టిఆర్ఎస్ నాయకులు ఒంటికాలితో విమర్శలు చేసే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిన రైతుల సమస్యలు
ఏడాది క్రితం రైతాంగ సమస్యలపై జెఎసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసింది. రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఏ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.పరిష్కార మార్గాలు ఏమిటనే విషయాలపై జెఎసి ఓ నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి అందజేసింది. అయితే రైతుల ఆత్మహత్యలపై జెఎసి దీక్షను కూడ చేపట్టింది. విపక్షాలు కూడ ప్రభుత్వంపై అదే సమయంలో ఒత్తిడిని తెచ్చాయి. ఆత్మహత్య చేసుకొన్న రైతులకు పరిహరాన్ని పెంచాలని జెఎసి డిమాండ్ చేసింది.ఈ పరిణామాలన్నీ ప్రభుత్వానికి జెఎసిపై కోపాన్ని పెంచాయి. టిఆర్ఎస్ నాయకులు జెఎసిపై ఎదురుదాడి వ్యూహన్ని అనుసరించారు.
జెఎసి నుండి బయటకు వచ్చిన సంఘాలు
జెఎసి చేస్తోన్న కార్యక్రమాలపై ప్రభుత్వానికి ఇబ్బంది కలుగడంతో జెఎసిలో ఉన్న కొన్ని సంఘాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి.రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని సంఘాలు జెఎసిగా ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం సిద్దించినందున జెఎసి ఏర్పాటు అవసరం లేదనే కారణాన్ని సాకుగా చూపి జెఎసిలో భాగస్వామ్యులుగా ఉన్న సంఘాలు బయటకు వచ్చాయి.దీని వెనుక అధికార పార్టీ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే ఈ విషయమై తనతో కలిసి ఉండే సంఘాలతోనే జెఎసి తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించింది.
ప్రజల పక్షానే జెఎసి పోరాడుతోంది
ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాటం చేస్తోందని జెఎసి చైర్మెన్ కోదండరామ్ చెబుతున్నారు. మల్లన్నసాగర్ ముంపు నిర్వాసితుల వ్యవహరంలో జెఎసి పోరాటం నిర్వహించింది. ఈ పోరాటం లో ఇతర పార్టీలతో కలిసి పోరాడింది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల తరపున చేసిన పోరాటం ప్రభుత్వానికి మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టింది.అభివృద్ది పేరుతో విద్వంసం సాగుతోందని జెఎసి నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకవర్గాలకు అలవాటేనని విమర్శించారు.
ప్రజలు ఆత్మీయ మిత్రులు
ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవాల్సిన అవసరం తనకు రాలేదని చెబుతున్నారు కోదండరామ్ . ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు మిత్రుడే అయినా ప్రజలు తనకు ఇంకా ఆత్మీయ మిత్రులని కోదండరామ్ అభిప్రాయపడుుతున్నారు. మంత్రులు, చీఫ్ సెక్రటరీలకు కూడ అందనంత బిజిలో ముఖ్యమంత్రి ఉంటున్నారని ప్రచారంలో ఉందని జెఎసి చైర్మెన్ అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఓపిక ఎక్కువని, ఓపిక నశిస్తే తడాఖా చూపిస్తారని ఆయన చెప్పారు.కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే తనకు సిఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనేది వాస్తవం కాదని ఆయన కొట్టిపారేశారు.
తెలంగాణ వ్యతిరేకశక్తులతో ఎవరున్నారో తెలుసు
తెలంగాణరాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో ఉన్నవారంతా మంత్రివర్గంలో ఉన్నారా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవారు మంత్రివర్గంలో ఉన్నారో ప్రజలకు తెలుసునని జెఎసి అభిప్రాయపడుతోంది. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే తెలంగాణ వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారని, ఎవరు తెలంగాణకు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో ప్రజలకు తెలుసునని .జెఎసి చెబుతోంది.