జగన్: మొండిఘటం, కొత్త అధికార కేంద్రం
హైదరాబాద్: వైయస్ జగన్గా పిలిచే యెడుగిరి సందింటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మొండిఘటంగా పేరు పొందారు. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చెప్పినా తాను అనుకున్న దారిలోనే నడిచే కొత్త తరం రాజకీయ నాయకుడిగా వైయస్ జగన్ పేరు పొందారు. హెలికాప్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబర్లో తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ జీవితంలో తీవ్రమైన మార్పు వచ్చింది.
కాంగ్రెసు పార్టీలో ఇమడలేక ఆయన బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించారు. తండ్రి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టి కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇప్పుడు సీమాంధ్రకు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి) తానే ముఖ్యమంత్రి అవుతాననే ధీమాతో ఎన్నికల పోరు సాగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి, నిరంతరం పోరాటం చేస్తున్నారు. 16 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్నా ఆయన ప్రాబల్యం తగ్గలేదు.
తండ్రి మరణించిన కొద్ది గంటల వ్యవధిలోనే జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ప్రయత్నాలు జరిగాయి. కానీ కాంగ్రెసు అధిష్టానం అందుకు అంగీకరించలేదు. రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. జగన్కు ఆ సమయంలో మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కూడా లభించింది.

రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని 2010 నవంబర్లో ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెసు అధిష్టానం కూర్చోబెట్టడంతో జగన్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మూడు దశాబ్దాల పాటు కాంగ్రెసుకు సేవలు చేశారు, తనకు కాంగ్రెసు అధిష్టానం కడప లోకసభ స్థానాన్ని ఇచ్చింది. అయినా కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించి, పోరాటానికి సిద్ధమయ్యారు.
జగన్ 2011 మార్చిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. నిజానికి దాని పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ. ఆ తర్వాత లోకసభ స్థానానికి పోటీ చేసి, తిరిగి ఉప ఎన్నికల్లో అదే లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు. తన తల్లి వైయస్ విజయమ్మను పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి నిలిపారు. జగన్ 5 లక్షల 21 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, విజయమ్మ 85,191 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయమ్మకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ఆమె మరిది వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం పోటీకి దింపింది. అప్పటి నుంచి తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని జగన్ దూరం పెట్టారు.
జగన్కు సంబంధించినంత వరకు కడప జిల్లాలోని పులివెందుల గ్రామానికి ప్రాముఖ్యం ఉంది. జగన్ 1972 డిసెంబర్ 21వ తేదీన అక్కడ జన్మ్ించారు. పులివెందుల, హైదరాబాదుల్లో ఆయన పాఠశాలవిద్య సాగింది. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడే జగన్ సాక్షి దినపత్రికను, సాక్షిటీవీ చానెల్ను స్థాపించారు. తెలుగు పత్రికా రంగంలో తిరుగులేని ప్రాబల్యం సంపాదించిన ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావును ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడ్డారు.
అక్రమాస్తుల కేసులో జగన్ 2012 మేలో జైలు పాలయ్యారు. 16 నెలల పాటు జైలులో ఉన్న తర్వాత 2013 సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించినందుకే తనను జైలు పాలు చేశారని జగన్ పదేపదే విమర్శిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ సీమాంధ్ర చాంపియన్ కావడానికి తెలంగాణను వదిలేసి జై సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టిస్తూ సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications