ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయ జీవితానికి మంచి రోజులు లేనట్లే అనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి, దానికి జీవం పోయడానికి ఆయన చేసిన ప్రతి ప్రయత్నమూ బెడిసి కొడుతోంది. టెక్కలి శాసనసభ ఉప ఎన్నిక ద్వారా తన సత్తా చాటుకుందామని ఆయన ప్రయత్నించారు. టెక్కలిలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించి తనకు మద్దతు ఉందని నిరూపించుకోవాలని భావించారు. అందుకే ఆయన టెక్కలి ఉప ఎన్నిక నామినేషన్ రోజు నుంచి ప్రచారానికి దిగారు. ఆ తర్వాత కూడా టెక్కలిలో ప్రచారం చేయాలని అనుకున్నారు. అయితే ఆయనకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతి అడ్డు వచ్చింది. ఆయన టెక్కలికి ప్రచారం కోసం వెళ్లలేకపోయారు. టెక్కలి ప్రచారానికి మంగళవారం తెర పడింది. వైయస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇడుపుల పాయ వెళ్లిన చిరంజీవి అటు నుంచి అటే చెన్నై వెళ్లిపోయారు. ఆయన తిరిగి సోమవారం సాయంత్రం హైదరాబాదుకు వచ్చినట్లు సమాచారం. ఏమైనా ఆయన రాజకీయ జీవితం అంత సజావుగా సాగేట్లు లేదని వ్యాఖ్యానిస్తున్నారు. టెక్కలి ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా వెళ్లలేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబుకు జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కానీ పార్టీకి జవజీవాలు అందించడానికి టెక్కలి ఉప ఎన్నిక ఫలితాన్ని వాడుకోవాలని భావించిన చిరంజీవికి మాత్రం ఇది మరో దెబ్బనే.