కెసీఆర్ కొత్త టార్గెట్?
దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. ను టార్గెట్ చేసుకొని బుధ గురువారాల్లో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పై కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నేతలు కూడా ఒక్కసారిగా విరుచుకొని పడ్డారు. కెసిఆర్ పై మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. తీవ్రంగా స్పందించారు. ఒక పక్క సోనియాను కరుణామయి అని అంటూనే మరో పక్క వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయన వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తూ పనిలో పనిగా తెలుగు దేశం పార్టీని కూడా వదల కుండా విమర్శలు చేశారు. ఏదో ఒక వ్యూహాన్ని రూపొందించుకోకుండా నోరు విప్పే అలవాటు లేని కెసిఅర్ ఈ సారి ఎలాంటి వ్యూహ రచన చేశారో అని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నారు.
రాష్ట్రం ఒక పక్క వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. రాష్ట్రాన్ని ముంచెత్తిన జలప్రళయం నుంచి ఇక ప్రజలు తేరుకోలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో కెసిఆర్ వరద ను రాజకీయం చేసి దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. కెసిఆర్ రాజకీయ లక్ష్యం ఏదైనా రాష్ట్రం ప్రస్తుతం ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. బాధితులను ఆదుకోవడం వారికి సహాయ సహకారాలు అందించి పూర్తిగా వారు కోలుకునేలా చూడాల్సిన నేతలు వరదలను బురద రాజకీయం చేయడం మాత్రం ఎవరు సమర్థించడంలేదు.