కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి రోశయ్యకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దూరమవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఆయన హాజురు కాలేదు. తాను హాజరు కానప్పుడు తన పార్టీ ప్రతినిధినైనా పంపవచ్చు. కానీ ఆయన పంపలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మాత్రం తన పార్టీ ప్రతినిధిని పంపారు. అంటే, చంద్రబాబుకు దగ్గరవుతున్నారా అనే అనుమానం కన్నా కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారా అనే అనుమానానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అవసరమైతే రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడడానికి ముందుకు వస్తానని ప్రకటించిన చిరంజీవి మనసు మార్చుకున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రజారాజ్యం, మజ్లీస్ మినహా అన్ని పార్టీలు తమ నాయకులను పంపించాయి. తెలుగుదేశం తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి ఆదివారం ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. సోమవారంనాటి అఖిల పక్ష సమావేశానికి చిరంజీవి తన పార్టీ నాయకుడిని కావాలనే పంపలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెసుకు దూరం కావాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.