మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఒక్క వెలుగు వెలిగిన ఆయన క్రమంగా కనుమరగువుతూ వచ్చారు. ఏ పార్టీలోనూ ఆయన ఇమడలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రిగా ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ఏదీ ఆయన రాజకీయ జీవితాన్ని నిలబెట్టలేకపోయింది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇప్పుడు ఆయనకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ నాయకత్వంలో ఆయన పనిచేసేందుకు సిద్ధపడినట్లు వినికిడి. ఇది జగన్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. అదే విధంగా మాచర్ల శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి కూడా జగన్ ను కలిశారు. జగన్ కొత్త రాజకీయ పార్టీ పెడితే కొత్త రక్తం, పాత రక్తం కలగలిసి ఉంటుందా అనేది చూడాల్సిందే.