వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన నేతల రాజీనామాలతో త్వరలో రాష్ట్రంలో మరోమారు ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఖాళీ అయిన స్థానాల్లో ఆయా నియోజకవర్గాల్లో రాజీనామా చేసిన నేతలే జగన్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లా రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్ర రెడ్డి మాత్రం ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ససేమీరా అంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్థానికంగా తన పట్ల ఉన్న వ్యతిరేకత ఆయనకు ఆందోళన కలిగిస్తోందంట. గెలిపించే బాధ్యత నాది అని పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చినప్పటికీ కాపు ఒప్పుకోవడం లేదట.
దీంతో రాయదుర్గ నుండి ఆ పార్టీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ రోజాను బరిలోకి దింపేందుకు పార్టీ యోచిస్తుందని తెలుస్తోంది. అక్కడి నుండి రోజాను బరిలోకి దింపే విషయమై పార్టీలో అందరూ అంగీకరించారని తెలుస్తోంది. రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ మెంబర్. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో పోటీ చేసి మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు. ఆమె జగన్ పార్టీలో చేరాక 2014 నగరి అభ్యర్థిగా ఈమె అవుతుందని అందరూ భావించారు. అయితే కాపు పోటీకి విముఖత చూపడంతో అక్కడ రోజానే సరైన అభ్యర్థి అని పార్టీ నేతలు భావిస్తున్నారట.