వైయస్ జగన్, యడ్యూరప్ప: ఇద్దరూ ఒక్కటే
తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని వైయస్ జగన్ నేరుగా ఎప్పుడూ అడగలేదు. కానీ దాని కోసం కాంగ్రెసులో ఉన్నంత కాలం తాను చేయాల్సిందంతా చేశారు. ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠం తనకు కట్టబెట్టాలని కాంగ్రెసు అధిష్టానంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చారు. యడ్యూరప్ప లాగానే అధిష్టానంపై ధిక్కారం ప్రకటించారు. అధిష్టానం వద్దని చెప్పినా ఓదార్పు యాత్ర చేపట్టారు. తాను చేసినదాన్నే కాంగ్రెసు అధిష్టానం అంగీకరించాలని మొండి పట్టారు.
అనివార్యమైన స్థితిలోనో, బలహీనమైన క్షణంలో అధిష్టానం ఆదేశాలకు తలొగ్గి యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోకాయుక్త ఆరోపణల వల్ల ఆయన రాజీనామా చేశారు. కానీ ఆయన మనసంతా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ తిరుగుతోంది. తిరిగి తనకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలంటూ బిజెపి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు కారణంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీని పెట్టాల్సిన స్థితిలో పడ్డారు. యడ్యూరప్ప అటు కాంగ్రెసు వైపు వెళ్లాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఏమైనా, కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై యడ్యూరప్ప, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీపై వైయస్ జగన్ కన్నేశారనేది నిజం.