'సోనియాకు చెమట పట్టకుండా జగన్ ఫ్యాన్'
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెమట పట్టకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఫ్యాన్ తిరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తోంది. వైయస్ జగన్ బెయిల్ పైన బయటకు రావడం, విభజన విషయంలో సోనియా గాంధీని విమర్శించక పోవడం కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యల మ్యాచ్ ఫిక్సింగ్కు నిదర్శనం అని టిడిపి ఆరోపిస్తోంది.
కాంగ్రెసు పార్టీ నేతలు కూడా కొందరు అవే ఆరోపిస్తున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ను, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును చూసుకొని కాంగ్రెసు పార్టీ విభజన చేస్తోందని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పలువురు సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దత్తపుత్రుడు దొరికాడని తమను అరువుపుత్రులుగా చూస్తున్నారని రెండు రోజులుగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దత్తపుత్రుడితో కలిసి తమ పార్టీ 2014లో అధికారంలోకి రావాలని చూస్తోందని, విభజన నిర్ణయం వెనుక గుట్టును తాను తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాక వెల్లడిస్తానని, దత్తపుత్రుడు గేమ్ ప్లాన్కు గండికొడతానని చెబుతున్నారు.
సొంత పార్టీ నేతలో కాంగ్రెసు అధిష్టానం పైన విమర్శలు గుప్పిస్తుండగా టిడిపి నేతలు సోనియా గాంధీకి చెమట పట్టకుండా జగన్ ఫ్యాన్ తిరుగుతోందని ఎద్దేవా చేస్తున్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. 2014 ఎన్నికల్లో టిడిపిని ఎదుర్కొని ఎక్కువ సీట్లు గెలుచుకోలేమని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెసు తెరాస, జగన్లతో కలిసి ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు.
ఒప్పందంలో భాగంగా బెయిల్ పైన బయటకు వచ్చిన జగన్ 2014 ఎన్నికల నేపథ్యంలో సోనియా గాంధీకి చెమట పట్టకుండా ఉండేందుకు తన ఫ్యాన్ను తిప్పుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ... సోనియాకు చెమట పట్టకుండా జగన్ ఫ్యాన్ తిరుగుతోందన్నారు.