ఎన్టీఆర్తో గేమ్స్: వైఎస్ శ్రీకారం, జగన్ మమకారం
అయితే, ఎన్టీఆర్ ఫోటోను ఉపయోగించడం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆయన దారిలోనే ఇప్పుడు జగన్ పార్టీ నడుస్తోందని కానీ, శృతిమించిందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్తో మొదలుపెట్టి ఎన్టీఆర్ వరకు ఫ్లెక్సీ మీదకు లాగారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో జోహార్ ఎన్టీఆర్, జోహార్ వైఎస్ఆర్ అంటూ ఫ్లెక్సీలు వేశారు. ఇది స్థానిక నేతల మితిమీరిన ఉత్సాహమా? కార్యకర్తల తెలిసీతెలియనితనమా? లేక పకడ్బందీ వ్యూహమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతేడాది జగన్ ఓదార్పు యాత్రలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన తండ్రి వైయస్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ పక్కనే ఎన్టీఆర్ విగ్రహానికి జగన్ నమస్కారం చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ నేతలు ఎన్టీఆర్ను ఏకంగా తమ పోస్టర్లపైకి లాగారు. రాష్ట్ర రాజకీయాల్లో తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడికి జగన్ నమస్కరించడం, ఇప్పుడు ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ మార్కు అనుకోకుండా జరిగినవి కాకపోవచ్చునని అంటున్నారు.
దీని వెనుక తమ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడం, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడం అనే రెండంచెల వ్యూహం దాగి ఉందని పేర్కొంటున్నారు. చంద్రబాబును టార్గెట్ చేసుకునేందుకు వైయస్ తొలుత ఎన్టీఆర్ను వినియోగించుకున్నారని అంటున్నారు. ఎన్టీఆర్కు, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు వారసుడు చంద్రబాబు కాదంటూ వైయస్ అసెంబ్లీ వేదికగా పలు సందర్భాల్లో చెప్పారు.
వెన్నుపోటు మంత్రాన్ని జపించారు. ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరికి కాంగ్రెస్లో పెద్ద పీట వేశారు. మొత్తంగా చూస్తే టిడిపికి అండగా ఉన్న సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు వైయస్ హయాంలోనే వ్యూహ రచన మొదలైంది. అప్పుడు కాంగ్రెసు తరఫున మొదలైతే ఇప్పుడు జగన్ పార్టీ ఆ వ్యూహాన్ని పకడ్బంధీగా అమలు చేస్తోందంటున్నారు. ఏకంగా ఎన్టీఆర్ ఫొటోను భుజానికెత్తుకుంది. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు అసలైన వారసుడు వైఎస్సే అని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.
రాష్ట్ర సినీ చరిత్రలో, రాజకీయ చరిత్రలో తిరుగులేని ఎన్టీఆర్ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు దాదాపు అన్ని పార్టీలు ఇప్పడు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైయస్ ప్రారంభించిన ఎన్టీఆర్ లెగసీని వాడుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గంలోని, అభిమానుల్లోని కొందరినైనా ఆకర్షించవచ్చుననేది జగన్ పార్టీ నేతల వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో 'వైయస్' సానుభూతి ఎప్పటి వరకు పనికొస్తుందో తెలియదంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్కు దొరికిన ఆయుధం ఎన్టీఆర్ అంటున్నారు. ఈ వ్యూహం వెనుక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సలహాలు, సూచనలు ఉండి ఉంటాయంటున్నారు.