టి: ఆమోస్ కాళ్లపై పడ్డ నన్నపనేని, ఆశీర్వాదం
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి కన్నీరుమున్నీరయ్యారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యులు ఆమోస్ కాళ్ల పైన పడి సమైక్యం కోసం వేడుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆమెకు ఆశీర్వదం ఇచ్చారు. ఈ ఆసక్తికర సంఘటన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకుంది.
మండలి మీడియా పాయింటు వద్ద నన్నపనేని, ఆమోస్లు ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా నన్నపనేని.. నమస్కారం అందరం కలిసుందామని చేతులు జోడించి చెప్పారు. దానికి ఆమోస్ ప్రతి నమస్కారం చేసి విడిపోయి అందరం కలిసుందామని అన్నారు.
దాంతో ఆమె ఒక్కసరిగా కన్నీళ్ల పర్యంతమై ఆమోస్ కాళ్ల పైన పడ్డారు. విడిపోవద్దని, కలిసుండి అన్నదమ్ముల్లా బతుకుదామని ఆమె విజ్ఢప్తి చేశారు. తన కాళ్లపై పడిన నన్నపనేని తల పైన ఆమోస్ చేయి పెట్టి దీవిస్తూ.. విడిపోయి మీరు మీ ప్రాంతంలో హాయిగా జీవించండి అని దీవించారు.
ఏమని ఆశీర్వదించారని పక్కనున్న వారు అడగ్గా.. త్వరగా మీ ప్రాంతానికి వెళ్లి మంచిగా బతకాలంటూ ఆశీర్వదించానని ఆమోస్ చెప్పారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు కల్పించుకొని కలిసుంటే అందరం హాయిగా, సంతోషంగా ఉండగలమని చెప్పారు.