కేజ్రీవాల్ కంటే ముందే ఎన్టీఆర్ 'సామాన్యుడు'
ఎఎపి సంచలనాలకు మీడియా ;కూడా విశేష ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఎఎపి ప్రతిచర్య సంచలనం అవుతోంది. ఎఎపిని 'సామాన్యుడి' పార్టీగానే అందరూ చూస్తున్నారు. ఈ కారణంగానే ఆ పార్టీ వైపు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మొగ్గు చూపుతున్నారు.
అయితే, ఇలాంటి నిర్ణయాలను స్వర్గీయ నందమూరి తారక రామారావు నాడే అమలు చేసి చూపించారని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తన హయాంలో అవినీతిపై కొరడా ఝుళిపించారు. తన సొంత వాహనంలో ఎస్కార్ట్ ఆర్భాటం లేకుండా ప్రయాణించారు. ఆయన స్వయంగా వాహనం నడిపిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి అప్పట్లోనే ఆయన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు.
అవినీతిని అరికట్టడం కోసం ఇప్పటి లోకాయుక్త వంటి వ్యవస్థను అప్పుడే ఏర్పాటు చేసి విస్తృత అధికారాలు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తే, నాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలుచేసింది. అవినీతి మంత్రులను తొలగించారు. ఎన్టీఆర్ సిఎంగా ఉన్నంతకాలం ప్రభుత్వ భవనాలను తన నివాసానికి ఉపయోగించుకోలేదు. సొంతింట్లో ఉండేవారు. సిఎంగా ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకునే వారు. ముఖ్యమంత్రిగా తను వాడే సొంత వాహనాన్ని కుటుంబ సభ్యులు వాడటానికి కూడా ఎన్టీఆర్ అనుమతించేవారు కాదు.