జగన్ పలకరింపు: కెవిపి రిప్లై, సబ్బం ఘాటు
పార్లమెంటు ఆవరణలో సబ్బం హరి ఎదురైనప్పుడు జగన్ నవ్వుతూ ఆయనను పలకరించారు. "అన్నా! నేనేం పాపం చేశాను? నా వల్ల ఏం తప్పు జరిగింది? ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నావు? నిన్ను నేనేమన్నా ఎప్పుడైనా అన్నానా?'' అని అడిగారట. దీనిపై సబ్బం హరి ఘాటుగా స్పందించారు. 'నువ్వేం చేశావో నీకు తెలుసు. నన్నడుగుతావేం?' అని ఎదురు ప్రశ్నించారు. 'అది కాదు హరన్నా! నా మాట విను. మనిద్దరం స్నేహితులుగా కొనసాగుదాం!' అని జగన్ సర్ది చెప్పే ధోరణిలో మాట్లాడారట.
అయితే, సబ్బం హరి సర్దుబాటుకు ససేమిరా అన్నారు. "నేను మాటమీద నిలబడే వాడిని. మాట తప్పే వాడిని కాదు. నేనేం చేశానని మీ వాళ్ల ద్వారా నన్ను అవమానించావు?'' అని ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. జగన్ పక్కనే ఉన్న మైసూరా రెడ్డి, బాలశౌరి కూడా సబ్బం హరికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు.
కెవిపి రామచంద్రరావును కూడా వైయస్ జగన్ పలకరించినట్లు చెబుతున్నారు. గతంలో కెవిపి ఎప్పుడు ఎదురైనా జగన్ ముఖం తిప్పుకొని వెళ్లిపోయే వారు. ఇటీవల మాత్రం ఆయన పార్లమెంట్లో కనిపించినప్పుడు ముఖం మీద నవ్వులు పూయించి 'అంకుల్... ఎలా ఉన్నారు?' అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 'బాగున్నాను అల్లుడూ' అని కెవిపి బదులిచ్చారు.