'స్కీమ్స్' కోసం పాటలు రాసేందుకు సై అన్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి సంబంధించి అవసరమైతే తాను కూడా పాటలు రాస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, జయరాజు, వరంగల్ శ్రీనివాస్ తదితరులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పారు. సాంస్కృతిక కళారూపాలు, పాటల రూపంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పథకాల ప్రచారానికి అవసరమైతే తాను పాటలు రాస్తానని వారికి చెప్పారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కళాకారులు రూపొందించిన పాటలు, కళారూపాలు ప్రజలకు చేరువయ్యాయని, వారిని చైతన్యపరిచాయన్నారు. రసమయి నేతృత్వంలో పని చేసే కళాబృందాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు.
గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెబుతూ.. వాటిని వివరించారు. మిషన్ కాకతీయ, జలహారం (వాటర్ గ్రిడ్)ల ప్రాధాన్యతను విరించారు. వీటన్నింటి పైన జనాలను జాగృతం చేయాలని సూచించారు.