తప్పిపోయిన తల్లీబిడ్డలను కలిపిన ‘వాట్సాప్’!
వరంగల్: సోషల్ మీడియా వల్ల చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతున్నా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. తమ కుటుంబాల నుంచి దూరమైన కొందరు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలతో చాలా కాలం తర్వాత కలుసుకున్న ఘటనలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేం ద్రంలో కేసముద్రం (వి) గ్రామానికి చెందిన చిట్టె సునీత అనే మహిళ తన మూడేళ్ల కొడుకు, రెండేళ్ల కుమార్తె రచనను వెంట బెట్టుకొని కొత్త బట్టలు కొనేందుకు బయటికి వెళ్లింది. షాపులో బట్టలు కొంటుండగానే రచన బయటకు వచ్చి తప్పిపోయింది.
అలా నడుచుకుంటూ రైల్వేస్టేషన్ వరకు చేరుకున్న రచన రైలు శబ్దం విని ఏడుపులంకించుకోగా ఈ పాప ఎవరి బిడ్డని అడిగినా ఎవరు స్పందించలేదు. దీంతో కలువలకు చెందిన ఆటోడ్రైవర్ మల్లయ్య రచనను స్థానిక బాలాజీ టాకీస్ వద్దకు తీసుకువచ్చి ఆటో అడ్డా వద్ద పలువురిని పాప తల్లి జాడ గురించి అడిగాడు.

అక్కడే ఉన్న చికెన్ సెంటర్ యజమాని వెంకటేష్, విజయ దంపతులు అక్కడికి చేరుకొని ఏడుస్తున్న పాపను ఊరడించారు. తర్వాత పాపను ఫొటో తీసి వెంకటేష్ తన ఫోన్లో వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్లకు విషయాన్ని వివరిస్తూ సెండ్ చేశాడు.
ఫోన్లో చూసిన గాంధీ సెంటర్లో హోటల్ యజమాని శ్రీహరి అప్పటికే పాప తప్పిపోయిందని ఏడుస్తున్న తల్లికి పాప ఫోటో చూపించగా ఆ పాప తన బిడ్డేనంటూ చెప్పింది. ఆమెను పాప ఉన్న చోటుకు తీసుకెళ్లారు. బిడ్డ క్షేమంగా లభించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తప్పిపోయిన కాసేపట్లోనే తల్లిబిడ్డలను కలిపిన ‘వాట్సాప్'కు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications