ఎపికి ప్రత్యేక హోదా: పవన్ కళ్యాణ్ వర్సెస్ శివాజీ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయం ఇద్దరు సినీ నటుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్కు, సినీ నటుడు శివాజీకి మధ్య పోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం, బిజెపిల మధ్య అంతర్గత సమరమే వారిద్దరి రూపంలో బయటపడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం శివాజీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ప్రత్యేక హోదా ఖాయంగా వస్తుందని అన్నారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్పై శివాజీ ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బిజెపికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం టిడిపి వర్గాల్లో ఉంది. దీంతో టిడిపి తరఫున శివాజీ రంగంలోకి దిగారని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు వారి స్థాయిలో వారు పోరాటం చేస్తున్నారని శివాజీ అనడాన్ని బట్టి ఆయన ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇదిలావుంటే, ప్రత్యేక హోదా సాధన విషయంలో పవన్ కళ్యాణ్ ఆ మధ్య తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులను ఉతికి ఆరేశారు. దాంతో కేశినేని నాని వంటి టిడిపి పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురు దాడికి దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జోక్యంతో వారు వెనక్కి తగ్గారు.
పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో రంగంలోకి దిగే విధంగా ఆయనపై ఒత్తిడి పెంచడానికే శివాజీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. మిత్రపక్షం కావడంతో బిజెపిని ఏమీ అనలేని పరిస్థితిలో టిడిపి ఉంది. దానికి తోడు, పవన్ కళ్యాణ్ను తమంత తాముగా దూరం చేసుకోవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదు. దీంతో టిడిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ శివాజీ ద్వారా కార్యం నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం శివాజీ చేస్తున్న పోరాటాన్ని సమర్తిస్తున్నట్లు చంద్రబాబు గతంలో ఓసారి చెప్పారు. ఎవరు పోరాటం చేసినా తాను సమర్థిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే తమ పని సులభమవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications