లైవ్ షోలో పరస్పరం తిట్టుకున్న బోండా ఉమ, చెవిరెడ్డి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులు హద్దులు మీరుతున్నారని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. టిడిపి సభ్యులు హద్దులు మీరుతున్నారని వైసిపి, వైసిపి నేతలు హద్దులు మీరుతున్నారని టిడిపి నేతలు కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీ శాసన సభలో రోజా వ్యవహరించిన తీరు పైన ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. ఇతర అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా సభలో హద్దులు మీరుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బయట కూడా ప్రజాప్రతినిధులు ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
తాజాగా, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు ఓ టీవీ ఛానల్ లైవ్ కార్యక్రమంలో ఒకరి పైన మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఒకరినొకరు దూషించుకున్నారు. తిట్టుకున్నారు. అరేయ్.. అంటే అరేయ్ అన్నంత పని చేశారని తెలుస్తోంది.

నిర్వాహకులు ఎంతగా వారించినా వారు పట్టించుకోకపోవడం గమనార్హం. విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విషయాల్లో కేంద్రం చేస్తున్న జాప్యంపై జరుగుతున్న చర్చలో తొలుత బొండా ఉమా, బిజెపి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఫోన్ లైన్ ద్వారా చెవిరెడ్డి చర్చలోకి వచ్చారు.
చర్చ సందర్భంగా చెవిరెడ్డి, బోండలు పరస్పరం దూషించుకున్నారు. ఎర్రచందనం దుంగలను దొంగిలించే దొంగవని, దుంగలను కొట్టిన కేసులో జైలుకు వెళ్లి వచ్చావని బోండ ఉమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. దమ్ముంటే తనపై ఆధారాలతో కేసు పెట్టాలని సవాల్ చేశారు. ఇరువురు పరస్పరం అరేయ్, ఒరేయ్ అని సంభోదించుకనేంత వరకు వెళ్లారు. నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేయడంతో వారు తగ్గారు.












Click it and Unblock the Notifications