‘మాహిష్మతి’పై చంద్రబాబు కన్ను: అమరావతికి రాజమౌళి మెరుగులు
‘బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా సత్తాను భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలకు తెలియజేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి తన సేవలను అందించనున్నారు.
అమరావతి: 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా సత్తాను భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలకు తెలియజేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి తన సేవలను అందించనున్నారు. ఆయన బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించిన విషయం తెలిసిందే.
రాజమౌళి సినిమా దర్శకుడే అయినా.. ఆయనలో సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉంది. ఆయనలోని ఆ నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అమితంగా ఆకట్టుకుంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

ముఖ్యంగా ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేగాక, గతంలోనే చంద్రబాబు ఈ విషయంపై రాజమౌళిని సంప్రదించారు.
ఈ నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం హైదరాబాద్ వెళ్లి రాజమౌళితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ అంశంపై గంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు.
దిగ్గజ భవనాలుగా నిర్మిస్తున్న శాసనసభ, హైకోర్టుల ఆకృతుల విషయంలో సలహాలు ఇవ్వాలని కోరారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. 'నా వంతు సహకారం అందిస్తా'నని చెప్పారు. కాగా, తెలుగు రాష్ట్రాల సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రలు వంటి పలు అంశాలపై సీఆర్డీఏ బృందంతో రాజమౌళి చర్చించినట్టు తెలిసింది.
రాజధాని నిర్మాణంలో తనవంతు సహకారం అందిస్తానని, ఆకృతుల రూపకల్పనకు ప్రభుత్వం నియమించే భవన నిర్మాణ శిల్పులకు సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న బాహుబలి-2 విడుదల తర్వాత దీనిపై అధిక సమయం కేటాయించగలనని రాజమౌళి తెలిపినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications