నోటికి ఎంత వస్తే అంత: దామోదర బూతుపురాణం
సంగారెడ్డి: మీడియా ప్రతినిధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. ఆయన అనుచరులు దాడి చేశారు. "మీడియా నా... కొడుకులు మూడు కెమెరాలతోనే వీడియోలు తీస్తున్నారు. నా ప్రోగ్రాంలో నేను మాట్లాడే వీడియోలు తీసి పబ్లిష్ చేయడం లేదు" అని విరుచుకుపడ్డారు.
మెదక్ జిల్లా తొగుట బాధితుల సమావేశానికి బుధవారంనాడు హాజరైన ఆయన మీడియాపై బూతుపురాణం విప్పారు. మీడియా ప్రతినిధులు అభ్యంతరం చెప్పడంతో ఆయన అనుచరులు ఘోరంగా తిడుతూ దాడికి దిగారు. కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల ఆధ్వర్యంలో తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్లో మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షా శిబిరం ప్రారంభించారు.
ఈ దీక్షలకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ తరుపున గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, అద్దంకి దయాకర్తో పాటు దామోదర్ రాజనర్సింహ తదితరులు వచ్చారు. దామోదర్ రాజనరసింహ తన ప్రసంగం మొదలు పెడుతూనే "అరే మీకేమన్న ఉన్నదా... అసలు గింత లొల్లి జరుగుతుంటే మీడియా కొడుకులు ఒక్కడన్న పేపర్ల రాస్తున్నడా... టీవీలల్ల చూపిస్తున్నడా... మొదాల్ గీళ్లను పలగొడ్తే అంత సాఫ్ అయితది" అని విరుచుకుపడ్డారు.
"ఈ నా కొడుకులు సర్కారుకు అమ్ముడు పోయిండ్రు... వీళ్లను ముందుగాల తన్నాలె.." అంటూ రెచ్చిపోయారు. సహనం నశించి చివరకు మీడియా ప్రతినిధులు - అనవసరంగా తమపై నిందలు వేయడం సరికాదంటూ కొందరు దామోదర రాజనర్సింహతో అన్నారు. మళ్లీ రెచ్చిపోయిన దామోదర్ రాజనర్సింహ "ఇంకా ఏం జూస్తున్నర్రా.. తన్ను ండ్రి... ఆ నా కొడుకులను" అంటూ రెచ్చగొట్టడంతో దామోదర్ రాజనర్సింహ అనుచరులైన కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు.
దాడిలో వీ6 ఛానల్ ప్రతినిధి ప్రసన్నకుమార్, సిటీ చానల్ విలేకరి శ్రీకాంత్, ఏబీఎన్ చానల్ ప్రతినిధి దాస శ్రీనివాస్, 99 టీవీ చానల్ కెమెరామెన్ నవీన్, ప్రింట్ మీడియాలో సూర్య దినపత్రిక విలేకరి నాయిని సంజీవరెడ్డి, టీవీ 9 విలేకరి యాదగిరి, ఈ టీవీ కెమెరామెన్ ఉమా మహేశ్వర్ తదితరులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో టీవీ చానల్ విలేకరులకు చెందిన పెద్ద కెమెరాలు, ఒక హ్యాండ్ కెమెరా, ఫొటో కెమెరాలు ధ్వంసమయ్యాయి.
దాడి ఘటనపై మీడియా ప్రతినిధులు తొగుట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామోదర్ రాజనర్సింహను ప్రధాన నిందితుడిగా చేర్చి, ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు పోలీసులను కోరారు.