శశికళ జైలుకు వెళ్తే.. ఆ ముగ్గురిలో ఒకరికి సీఎం అయ్యే ఛాన్స్!?
ముఖ్యంగా సుప్రీం తీర్పు గనుక తనకు ప్రతికూలంగా వెలువడితే సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలి? తన ఆదేశాల మేరకు విధేయతతో నడుచుకునే వ్యక్తి ఎవరు? వంటి అంశాల మీద శశికళ చర్చలు జరిపినట్టు సమాచారం.
చెన్నై: మంగళవారం 10.30గం.సమయంలో శశికళ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కీలక తీర్పు వెలువరించనుండంతో.. గత రాత్రి ఆమె గోల్డెన్ బే రిసార్టులోనే బస చేశారు. రాత్రి 2గం. వరకు ఎమ్మెల్యేలతో పలు కీలక మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా సుప్రీం తీర్పు గనుక తనకు ప్రతికూలంగా వెలువడితే సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలి? తన ఆదేశాల మేరకు విధేయతతో నడుచుకునే వ్యక్తి ఎవరు? వంటి అంశాల మీద శశికళ చర్చలు జరిపినట్టు సమాచారం.ఇప్పటికైతే ముగ్గురి నేతల పేర్లు తెరపై కనిపిస్తున్నాయి.

సుప్రీం తీర్పు తనను అధికారానికి దూరం చేస్తే.. తన స్థానంలో సెంగొట్టయ్యన్, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురైలలో ఒకరిని సీఎం చేయాలని శశికళ భావిస్తున్నారు. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత శశికళ తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
అసంతృప్తిలో తంబిదురై:
పన్నీర్ సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించిన వెంటనే ఆ పదవి తనకు దక్కుతుందేమోనని లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ స్థానంలో సీనియర్ నేత కేఏ సెంగొట్టయ్యన్ను నియమించడంతో తంబిదురై అసంతృప్తికి లోనయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయన గత నాలుగు రోజులుగా పోయెస్ గార్డెన్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజానికి జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని కూడా తంబిదురై భావించారు. అయితే శశికళ ఆ పదవిలో కూర్చోవడంతో ఆశలు వదులుకున్నారు.
ఇక ఇప్పుడు ఆమె సీఎం అయితే ప్రధాన కార్యదర్శి పదవి తనకు దక్కుతుందేమోనని ఆశిస్తున్నా.. సుప్రీం తీర్పు ఆమెకు ప్రతికూలంగా వస్తే అది కూడా కష్టమే. అయితే సుప్రీం తీర్పు గనుక ప్రతికూలంగా వస్తే ఎలాగూ సెంగొట్టయ్యన్, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురైలలో ఒకరిని సీఎం చేయాలని భావిస్తున్నారు గనుక ఆ ఛాన్స్ తంబిదురైని వరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications