రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్: చంద్రబాబుతో దోస్తీ, విపక్షాలపై కెసిఆర్ ప్లాన్ ఇదీ...
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో స్నేహాన్ని పటిష్టం చేసుకోవాలని అనుకు
హైదరాబాద్: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో స్నేహాన్ని పటిష్టం చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన వెల్కం (వెలమ, కమ్మ కాంబినేషన్)ను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ప్రతిపక్షాలను ఏకం చేసి తనను ఢీకొట్టాలనే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాన్ని ఆదిలోనే దెబ్బ తీయాలని ఆయన భావించినట్లు, అందులో భాగంగానే వెల్కం వ్యూహాన్ని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ టిడిపిలో ఒంటిరిని చేస్తే తన పాచిక పారుతుందని ఆయన భావించి ఉంటారని సమాచారం.
రేవంత్ రెడ్డి ప్రయత్నాలను దెబ్బ కొట్టడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులను, మంత్రులను చేరదీసినట్లు కూడా అనుకుంటున్నారు. అయితే, అనూహ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయం తీసుకోవడం, అందుకు కాంగ్రెసు అధిష్టానం పచ్చ జెండా ఊపడం కెసిఆర్కు మింగుడు పడడం లేదని అంటున్నారు.

కెసిఆర్ అప్రమత్తం....
రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కెసిఆర్ అప్రమత్తమైనట్లు సమాచారం. కాంగ్రెసు బలం పుంజుకోకుండా చూడాలని ఆయన పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రులు ఇప్పటికే ఈ పనిలో పడ్డారని చెబుతున్నారు. బలమైన నాయకులు, తమకు పనికి వచ్చే నాయకులు కాంగ్రెసులో చేరకుండా చూడాలని ఆయన చెప్పినట్లు వినికిడి.

ముఖాముఖి పోటీ లేకుండా...
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో ముఖాముఖి పోటీ లేకుండా చూసుకునే ఎత్తుగడతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. త్రిముఖ లేదా బహుముఖ పోటీ ఉండేలా చూడాలని ఆయన అనుకుంటున్నారు. బిజెపి విడిగా పోటీ చేయడాన్నే ఆయన కోరుకుంటున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను పెట్టలేకపోయినా బిజెపి బలపడి అన్ని సీట్లలో పోటీ చేస్తే త్రిముఖ పోటీ ఉంటుందని ఆయన అనుకుంటున్నారు.

బిజెపి వల్ల ఇలా...
ప్రభుత్వ వ్యతిరేక ఓటును పొందడానికి వీలుగా బిజెపి బలపడితే, తన ఓటు శాతాన్ని 3 నుంచి 5 శాతానికి పెంచుకుంటే తమ తెరాసకు లాభిస్తుందనేది కెసిఆర్ అంచనా. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే తమకు ప్రయోజనం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందువల్ల బిజెపి బలం పెరగాలనే ఉద్దేశంతో తెరాస నాయకులు ఉన్నారు.

వలసలపై దృష్టి
తాజా పరిణామాల నేపథ్యంలో తాజాగా వలసలను ప్రోత్సహించాలని కెసిఆర్ భావిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులను తెరాసలోకి ఆహ్వానించాలని ఆయన అనుకుంటున్నారు. తాము బలపడడానికి ఉపయోగ పడే నేతల కోసం అన్వేషణ మొదలు పెట్టాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు నుంచి...
రేవంత్ రెడ్డి చేరిక వల్ల అసంతృప్తికి గురయ్యే కాంగ్రెసు నేతలపై దృష్టి పెట్టాలని, అదే సమయంలో కుల సమీకరణాలను చూసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సామాజికంగా బలమైన నాయకులను ఆయన పార్టీలోకి తీసుకునే ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications