అమిత్ షా వ్యూహం: చంద్రబాబుకు త్రిపుర తరహా షాక్?
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిపుర తరహా వ్యూహాన్ని అమలు చేసేంందుకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగం సిద్దం చేశారు. తిరుగులేని నేతగా పేరు పొందిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏమీ లేని చోటు బిజెపి అధికారం నుంచి కూలదోసింది.
అత్యంత పకడ్బందీ వ్యూహంతో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సిపిఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లను కూడగట్టడంలో బిజెపి విజయం సాధించింది అదే తరహా వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనే యోచనలో బిజెపి ఉంది.
సాయంత్రం బిజెపి నేతలతో అమిత్ షా
ఎన్డీఎ నుంచి తెలుగుదేశం వైదొలిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నేతలను అమిత్ షా ఢిల్లీకి పిలిచారు. వారితో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి అత్యంత రహస్యంగా బిజెపి నాయకత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా త్రిపుర తరహా వ్యూహాన్ని సాయంత్రం జరిగే సమావేశంలో ఖరారు చేస్తారు.
హరిబాబుకు చంద్రబాబుతో లింక్లు
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మార్పు విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలున్నాయని పార్టీలోని ఓ వర్గం అంటూ వస్తోంది. టిడిపికి వ్యతిరేకంగా పోరాడాలంటే అధ్యక్షుడి మార్పు తప్పదని చెబుతూ వస్తోంది. చంద్రబాబుపై ఎదురుదాడికి చేయాలంటే మరో నేతను అధ్యక్షుడిగా నియమింంచాలనే అభిప్రాయంతో ఉంది.
రాష్ట్ర ఇంచార్జీగా రామ్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇంచార్జీగా ప్రస్తుతం సిద్ధార్థ సింగ్ ఉన్నారు. ఆయన స్థానంలో రామ్ మాధవ్ను నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, జాతీయ నాయకత్వం పట్ల కొందరు బిజెపి నేతల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జివీఎల్ నరసింహా రావుకు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయాన్ని తమకు నామమాత్రంగానైనా చెప్పలేదని అంటున్నారు.
ఎపిలో వ్యూహం ఇదీ...
త్రిపురలో బిజెపి అత్యంత పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసింది. ఇందులో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా పెద్దది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టి తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్లు చెబుతున్నారు. బిజెపిపై చంద్రబాబు అగ్రహానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాష్ట్రంలోని ఇంటింటికీ వెళ్లి బిజెపికి మద్దతు కూడగడుతారని అంటున్నారు.