కేంద్రంపై కేసీఆర్ తిరుగుబాటు: పక్కా ప్లాన్ తోనే రంగంలోకి, తెర వెనుక 'థర్డ్ ఫ్రంట్'..
Recommended Video
హైదరాబాద్: బీజేపీకి మిత్రపక్షం కాకపోయినప్పటికీ.. ఒకానొక దశలో అంతకంటే ఎక్కువగానే వ్యవహరించారు కేసీఆర్. నోట్ల రద్దు సమయంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం సమర్థించారు. జీఎస్టీ విషయంలోనూ.. తొలుత సమర్థించి ఆపై మాట మార్చారు. ఇలా బీజేపీతో ఆచీ తూచీ వ్యవహరిస్తూ వస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం తిరగబడడానికే సిద్దమైనట్టు కనిపిస్తోంది.
కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్'..
జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని కేసీఆర్ మొన్నామధ్య చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయన అటువైపుగా మళ్లుతున్నట్టు చెబుతున్నాయి. ప్రధాని మోడీపై ఘాటైన విమర్శల వెనుక ఇదే కారణం ఉన్నట్టు అనిపిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్' ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జాతీయ పార్టీలపై తిరుగుబాటుకు ఆయన పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నట్టు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో మంతనాలు..
కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటన 'ఫెడరల్ ఫ్రంట్' ప్రయత్నాలకు ఊతమిచ్చింది. దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి?.. ఎలా మారబోతున్నాయి? అన్నదానిపై ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్.. ఢిల్లీలో సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులతో దీనిపై చర్చించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలన్ని జట్టుకడితేనే జాతీయ పార్టీల పెత్తనాన్ని నిలువరించవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే సంప్రదింపులు..
ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనే కాదు.. ఆ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) అధినేత శిబూసోరేన్, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యావవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(జేడీఎస్)లతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. మరికొంతమంది ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతోనూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై వారు స్పష్టమైన అభిప్రాయం చెప్పనప్పటికీ.. వ్యతిరేకత మాత్రం కనబర్చలేదని తెలుస్తోంది.
కేసీఆర్ తిరుగుబాటు
రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాల పెత్తనంతో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో 42శాతమే తిరిగి ఇచ్చి.. మిగతా 58శాతాన్ని తమ అనుకూల రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నందునా.. కొన్ని రాష్ట్రాలు తీవ్రంగ నష్టపోతున్నాయని అంటున్నారు.
రాష్ట్రాలకు ఆర్థిక అధికారం లేకుండా పోతే.. ఇంకెక్కడి ఫెడరల్ స్ఫూర్తి అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలంటే జాతీయ పార్టీల గుత్తాధిపత్యాన్ని నిలువరించడమే సరైన మార్గమని భావిస్తున్నారు.
కార్య రూపం దాలుస్తుందా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దేశవ్యాప్త రైతు సమస్యల పరిష్కారం, రాష్ట్రాల అధికారాలను కాపాడుకోవడం వంటి అంశాలతో జాతీయ స్థాయిలో సానుకూల ఫలితాలు సాధించవచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ఆయన మరింత ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు.