2019లో లోకేష్ ఇక్కడి నుండే పోటీ, ఎందుకంటే?
అమరావతి:2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుండి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఓ రకంగా, నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే పలమనేరు నుండి లోకేష్ బరిలోకి దిగితే ఉపయోగంగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ తరుణంలోనే ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్దం చేస్తున్నారు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు. అయితే వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లోకేష్ భావిస్తున్నారు.ఈ తరుణంలో సురక్షితమైన స్థానం కోసం టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే టిడిపి నేతలు పోటీ చేసే స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడ లేకపోలేదు. ఒకవేళ పునర్విభజన జరగకపోతే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పలమనేరు నుండి లోకేష్ పోటీ
2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ స్థానం నుండి లోకేష్ పోటీ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ అసెంబ్లీ స్థానం నుండి మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.లోకేష్ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉంటే తాను పుంగనూరు అసెంబ్లీ స్థానానికి మారుతానని అమర్నాథ్ రెడ్డి టిడిపి నాయకత్వానికి సూచించినట్టు సమాచారం.ఇటీవల పార్టీ శిక్షణ తరగతుల సమయంలో ఈ విషయాన్ని మంత్రి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళారని పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది.పలమనేరు నియోజకవర్గంలో గతంలో కుప్పం నియోజకవర్గంలోని రెండు మండలాలు చేరాయి.దీంతో ఈ మండలాల ప్రభావం లోకేష్కు కలిసొచ్చే అవకాశం ఉందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

పుంగనూరులో అమర్నాథ్ రెడ్డికి పట్టు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో కూడ మంత్రి అమర్నాథ్ రెడ్డికి పట్టుంది. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కాకముందు అమర్నాథ్ రెడ్డి పుంగనూరు నుండి టిడిపి అభ్యర్థిగా పలుమార్లు విజయం సాధించారు. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కూడ ఈ స్థానం నుండి పలుమార్లు ప్రాతినిథ్యం వహించారు.దీంతోనే పుంగనూరు నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ నాయకత్వానికి చెప్పారని సమాచారం.

నియోజకవర్గాల పునర్విభజన జరిగేనా
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజాగా టిడిపి, బిజెపి నేతల మధ్య చోటు చేసుకొన్న అగాధం నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం మొండిచేయి చూపడమే కారణమని బిజెపి నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కానీ, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏం చేయాలి, జరగకపోతే ఏం చేయాలనే దానిపై టిడిపి నేతలు కసరత్తు నిర్వహించారని సమాచారం. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే కొత్తవాటిని ఏర్పాటు చేయవచ్చు.. ఇదే ప్రాతిపదిక అయితే మాత్రం పలమనేరు.. చిత్తూరు.. చంద్రగిరి... పీలేరు.. నగరి... తిరుపతి నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

కలికిరి నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పీలేరు పరిధిలోని కలికిరిని నియోజకవర్గంగా మార్చేస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోరును తగ్గించవచ్చన్నది టీడీపీ నేతల ఆలోచనగా కన్పిస్తోంది .కలికిరిలో నల్లారి ఫ్యామిలీకి మంచి పట్టుంది. మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు.దీంతో కలికిరి నుండి నల్లారి కిషోర్కుమార్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications