తలసానిపై వేటుకు బాబు సిద్ధం
ఈ కమిటీ ముందుకు తలసాని హాజరవుతారా? హాజరుకారా?, ఒకవేళ హాజరైతే ఏం చెప్తారన్న దానిపైనా తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పటికే తలసానిపై వేటు వేసేందుకు తెదేపా మానసికంగా సిద్ధమైంది. ఈ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు బుధవారమిక్కడ నగర నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ నేతలు విజయరామారావు, తీగల కృష్ణారెడ్డి, అల్లాడి రాజ్కుమార్, సాయన్న, అరవింద్కుమార్గౌడ్, అలీ మస్కతి, బుగ్గారావు, రాంభొట్ల తదితరులు హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, నాగం జనార్దన్రెడ్డిలు కూడా హాజరయ్యారు. ఇందులో నగర నేతలంతా తలసాని వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పార్టీని ఇరకాటంలో పెట్టాలని తలసాని ప్రయత్నిస్తున్నారని, ఆయన కేవలం పార్టీని ఇబ్బందుల్లో పెట్టే ఉద్దేశంతోనే సమైక్యవాదంపై బహిరంగంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క చంద్రబాబును కలిసి పార్టీలో ఉంటానంటూనే...మరోవైపు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ను కలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పార్టీని విడిచి పోతారా? అని మీడియా అడిగినా...స్పష్టంగా చెప్పడం లేదని, కనీసం వెళ్లబోనని కూడా అనడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.