'గాలి' తిరుగుబాటుకు వైయస్ జగన్ తో లింక్
తమ బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెసు ప్రభుత్వాన్ని కర్ణాటకలో స్థాపించడం ద్వారా కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద జగన్ ప్రతిష్టను పెంచాలని గాలి సోదరులు భావిస్తున్నట్లు ఆ పత్రిక వార్తాకథనం వ్యాఖ్యానించింది. కాంగ్రెసు అధిష్టానంలోని కొందరు పెద్దల సహకారంతోనే గాలి సోదరులు యెడ్యూరప్పపై తిరుగుబాటుకు ఒడిగట్టినట్లు కూడా ఆ పత్రిక రాసింది. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చడానికి పది మంది శాసనసభ్యులు చాలు. గాలి సోదరుల పక్కన 40 మందికిపైగా శాసనసభ్యులున్నారు. వీరంతా గాలి సోదరుల అండదండలతోనే గెలుపొందారు. వీరిలో పది మంది మంత్రులు. బిజెపి దేవెగౌడ నాయకత్వంలోని జెడి (ఎస్) సహకారం తీసుకున్నా మనుగడ సాగించడం కష్టమే. జెడి (ఎస్)కు 26 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెసుకు 76 మంది సభ్యుల బలం ఉంది. గాలి వర్గానికి చెందిన 40 మంది మద్దతిస్తే కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం. అయితే శాసనసభ స్పీకర్ ను ముఖ్యమంత్రి పదవికి గాలి సోదరులు ముందుకు తెస్తున్నారు.