వైయస్ జగన్ పై హైకమాండ్ సీరియస్
ఆల్ రైట్, ఆమె రాజీనామా చేశారు, అంతే అని వీరప్ప మొయిలీ అన్నారు. ఆమె రాజీనామాపై ఉద్వేగం చెందాల్సిందేమి ఉందని ఆయన అడిగారు. రాజీనామా చేయాలని తాము సూచించలేదని ఆయన అన్నారు. సురేఖ రాజీనామా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అన్నారు. జగన్ భవిష్యత్తును పాడు చేస్తున్నారని ఆయన అన్నారు. మధుయాష్కీ మాటలు అధిష్టానం అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లు భావిస్తున్నారు. సురేఖ రాజీనామాకే కాక తదుపరి జగన్ వర్గం చర్యలకు కూడా లొంగకూడదనే గట్టి అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు అర్థమవుతోంది. జగన్ ఎంతగా చెప్పినప్పటికీ తిరుగుబాటును అధిష్టానం ఊహిస్తూనే ఉందని అంటున్నారు. రాజీనామాలు కాంగ్రెసుకు కొత్తేమీ కాదని ప్రదేశ్ కాంగ్రసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి చాలా నడుస్తుంటాయని ఆయన అన్నారు. సురేఖ రాజీనామా విషయం ముఖ్యమంత్రి రోశయ్యకు సంబంధించిన వ్యవహారమని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని ఆయన అన్నారు.
సురేఖ రాజీనామాకు కారణాలేమిటో తనకు తెలియవని, ఆమె రాజీనామా చేసినట్లు టీవీల ద్వారానే తెలిసిందని, లేఖ అందిన తర్వాత మాట్లాడుతానని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. అయితే సురేఖ రాజీనామా లేఖ గవర్నర్ నుంచి ముఖ్యమంత్రికి వస్తుంది. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. సురేఖ రాజీనామాను ఆమోదించేందుకే రోశయ్య సిద్ధపడినట్లు చెబుతున్నారు. సురేఖ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడిన వెంటనే గురువారం రాత్రి రోశయ్యను డి. శ్రీనివాస్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తదితరులు కలిశారు. డిఎస్, రోశయ్య మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. వీరిద్దరు ఫోన్ లో వీరప్ప మొయిలీతో మాట్లాడినట్లు సమాచారం. అధిష్టానం అభిప్రాయాన్ని తెలుకున్న ముఖ్యమంత్రి రోశయ్య సురేఖ రాజీనామా ఆమోదానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.