మైనింగ్ చిక్కుల్లో గాలి జనార్దన్ రెడ్డి
అభయారణ్యంలో ఆయన పెద్ద యెత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఆయన అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిర్ధారించింది. అది రుజువైతే ఆయనపై భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించిన గాలి సోదరులు బళ్లారి తదితర జిల్లాలో పెద్ద యెత్తున లాబీలను ఏర్పాటు చేసుకుని కాంగ్రెసును బలహీనపరిచారు. కాంగ్రెసుకు కంచుకోట అయిన బళ్లారిలో బిజెపిని నిలబెట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సంబంధాలున్నాయని ఇక్కడి ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సాధికారిక కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్ది, గాలి జనార్దన్ రెడ్డి సంబంధాలపై, అక్రమ తవ్వకాలపై, నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక శనివారం పెద్ద యెత్తున వార్తాకథనాలను ప్రచురించింది.