సమైక్యాంధ్ర ఆందోళన వెనక వైయస్ జగన్?
కాగా, ఆందోళనలకు దిగిన కాంగ్రెసు నాయకులు కూడా వైయస్ జగన్ సన్నిహితులే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన వెలువడిన వెంటనే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన లగడపాటి రాజగోపాల్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరికి మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని తరుచూ వినిపిస్తూనే ఉన్నది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబట్టినవారిలో లగడపాటి కూడా ప్రముఖుడు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి రాయలసీమ, కోస్తాంధ్ర మంత్రులకు నాయకత్వం వహించింది కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆనం రామనారాయణ రెడ్డి. అలాగే, సీమాంధ్ర శాసనసభ్యులకు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెసు అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి జగన్ కోసం ఎంత దూరమైన పోవడానికి సిద్ధపడి ఉన్నవారు.
కడప జిల్లాలో ఆమరణ దీక్షకు దిగిన ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి స్వయంగా జగన్ చిన్నాన్న. కడప జిల్లాలోని, రాయలసీమ జిల్లాలోని కాంగ్రెసు నాయకులు చాలా వరకు జగన్ కు అనుకూలంగా ఉన్నవారే. తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో రోశయ్య ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికి జగన్ వ్యూహరచన చేసినట్లు ఉప్పందుకున్న పార్టీ అధిష్టానం జగన్ కు తెలంగాణ పార్టీ నాయకులు మద్దతు లేకుండా చేయడానికి, తెలంగాణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి చిదంబరం చేత పకడ్బందీ ప్రకటన చేయించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ చర్యలు పార్లమెంటులో కూడా బహిర్గతమైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం కచ్చితంగా ఉన్నట్లు చెబుతున్నారు.