ఢిల్లీ కొంపముంచిన అక్షర్ పటేల్: చెన్నై చేతిలో బొక్కబోర్లా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 48వ మ్యాచ్లో సీఎస్కే అదరగొట్టింది. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఈ సీజన్లో రెండోసారి ఆ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో చెన్నై 10 పాయింట్లతో ప్లే-ఆఫ్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఢిల్లీకి ఇది ఆరో ఓటమి కావడంతో వారి ప్లే-ఆఫ్ మార్గం మరింత క్లిష్టంగా మారింది.
తడబడిన ఢిల్లీ టాపార్డర్..
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయమే ఢిల్లీ కొంపముంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (19), కేఎల్ రాహుల్ (12) శుభారంభం అందించే ప్రయత్నం చేసినప్పటికీ, 4 ఓవర్లలో 29 పరుగుల వద్ద నిస్సాంక అవుట్ కావడంతో వికెట్ల పతనం మొదలైంది.సీఎస్కే బౌలర్ల ధాటికి ఢిల్లీ కేవలం 69 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ రాణా(15), అక్షర్ పటేల్(2) వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం జట్టును దెబ్బతీసింది.

ఆదుకున్న స్టబ్స్, సమీర్ రిజ్వీ..
కష్టాల్లో ఉన్న జట్టును ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 47 బంతుల్లో 65 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్టబ్స్ 31 బంతుల్లో 38 పరుగులు చేసి ఔట్ కాగా, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ ఆఖరి వరకు క్రీజులో ఉండి 24 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా.. అఖీల్ హోసేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు.
సంజూ ఊచకోత.. కార్తీక్ శర్మ మెరుపులు!
156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) మరోసారి నిరాశపరిచాడు. అయితే, క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్కు తోడుగా కార్తీక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేయడంతో చెన్నై సునాయాసంగా విజయాన్ని అందుకుంది.
ప్లే-ఆఫ్ సమీకరణాలు..
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి రేసులో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే-ఆఫ్కు చేరాలంటే తమ మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. స్వదేశీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఓడిపోవడం ఢిల్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో చెన్నై విజయం సులభతరమైంది.












Click it and Unblock the Notifications