యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు ఇవే.. 26 అంశాలకు ఆమోదం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆలయ ధర్మకర్త మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ తొలి సమావేశంలో యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నప్రసాదం సామర్థ్యాన్ని రోజుకు 2 వేల మందికి పెంచాలని నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక నూతన నిర్మాణాలకు, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే కొండపై దీక్షాపరుల కోసం ప్రత్యేక వసతులు, నిత్యకల్యాణ మండపాలు ఏర్పాటు చేయనుంది.
వీటితో పాటు మెట్ల మార్గంలో భక్తుల రక్షణార్థం షెడ్ల నిర్మాణం చేపట్టాలని ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అలాగే వేద పాఠశాల, గోశాల ఏర్పాటు, రాయగిరి వద్ద ఆలయానికి స్వాగతంగా భారీ కమాన్ లు నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. రూ.43.12 కోట్లతో మండపం నిర్మించేందుకు అంగీకరించింది. నిత్య కల్యాణ మండపాలకు మరో రూ. 9.87 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం దాదాపు 1500 మందికి నిత్యాన్నదానం అవకాశం కల్పిస్తుండగా ఆ సంఖ్యను 2 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అలాగే ఆలయంలో ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలినడకన కొండపైకి చేరుకునే భక్తుల సౌకర్యార్థం రూ.1.4 కోట్లతో పైకప్పు నిర్మాణం చేపట్టేందుకు ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక తులసి కాటేజ్ వద్ద మరో కల్యాణ కట్ట.. కొండపై విరాళాల సమర్పణకు మరో ప్రత్యేక గది ఇలా మరికొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా 26 అంశాలకు ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఆలయ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.












Click it and Unblock the Notifications