PM Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు
80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి శుక్రవారం రాత్రి ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి వ్యాఖ్యలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ఆలోచనలు దేశ బలానికి, ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ సుస్థిరతను ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ కు ప్రతి భారతీయుడు కట్టుబడి ఉన్నాడన్న సంకేతాన్ని రాష్ట్రపతి ఇచ్చారని కొనియాడారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన అంశాలను పోస్టు చేశారు.
A motivating and thoughtful address by Rashtrapati Ji on the eve of Independence Day.
— Narendra Modi (@narendramodi) August 14, 2026
Her thoughts reflect the strength of our nation and the aspirations of every Indian.
Her message inspires us all to work with renewed determination for a Viksit Bharat.@rashtrapatibhvn https://t.co/G4gIA40iK8
"80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ రాష్ట్రపతి చాలా స్ఫూర్తిదాయకమైన, ఆలోచింపజేసే ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ఆలోచనలు భారత దేశ శక్తిని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. 2047 వికసిత్ భారత్ నిర్మాణం కోసం పునరంకిత భావంతో పనిచేయడానికి ఆమె సందేశం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిని కలిగిస్తోంది" అని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం మహిళలు, యువత, పేదలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. గత పదేళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని తెలిపారు.

అలాగే పేపర్ లీక్ ఘటనలపైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. పరీక్ష వ్యవస్థలో అవకతవకలను అరికట్టి, పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని యువతకు భరోసా కల్పించారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని.. వారి శక్తితో స్టార్టప్ వ్యవస్థ దేశ స్వర్ణ భవిష్యత్తుకు బాటలు వేస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అంతేకాక పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నూ ప్రస్తావించారు. ఉగ్రమూకలు, వారికి సాయం చేసేవారు ఎక్కడ దాక్కున్నా.. వారి చర్యల ఫలితాలను అనుభవించక తప్పదనే బలమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ వారికి పంపిందని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్రపతి తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications